
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్పై మంగళవారం (మే 19)జరపాల్సిన భారీ సైనిక దాడిని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య “తీవ్రమైన చర్చలు” జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం రాత్రి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
గత ఏప్రిల్ మధ్యలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతం పెళుసుగా మారింది. ఈ నేపథ్యంలో ఇరాన్ ఒక ఖచ్చితమైన ఒప్పందానికి రావడానికి సమయం మించిపోతోందని ట్రంప్ హెచ్చరించారు. “ఇరాన్కు ఇచ్చిన సమయం ముగుస్తోంది, వారు త్వరగా నిర్ణయం తీసుకోవడం మంచిది. లేకపోతే వారి జాడ లేకుండా పోతుంది” అంటూ వారాంతంలో చేసిన వ్యాఖ్యలు యుద్ధ మేఘాలను కమ్మేలా చేశాయి. తాజా పోస్ట్లో కూడా ఆయన ఇదే ధోరణిని కనబరుస్తూ, ఒకవేళ ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదరని పక్షంలో, ఏ క్షణంలోనైనా ఇరాన్పై పూర్తిస్థాయి, భారీ స్థాయి దాడికి సిద్ధంగా ఉండాలని అమెరికా సైన్యాన్ని ఆదేశించినట్లు స్పష్టం చేశారు.
మే 19, మంగళవారం దాడి చేయాలని ప్రణాళిక ఉన్నట్లు ట్రంప్ గతంలో ఎక్కడా బహిరంగంగా వెల్లడించలేదు. అయితే, మధ్యప్రాచ్యంలోని కీలక మిత్రదేశాలైన ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నాయకుల విజ్ఞప్తి మేరకు ఈ దాడిని వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ దేశాల నేతలు శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నించాలని కోరడంతో ఆయన వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
ఈ సంక్షోభంపై ట్రంప్ ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్లతో కూడా సుదీర్ఘంగా చర్చించారు. టెహ్రాన్కు పదేపదే గడువులు విధించడం, ఆపై వెనక్కి తగ్గడం ట్రంప్ శైలిగా కనిపిస్తున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు మాత్రం అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచం దృష్టి అంతా ఇరాన్ తీసుకోబోయే తదుపరి అడుగుపైనే ఉంది. ఒకవేళ చర్చలు విఫలమైతే, మధ్యప్రాచ్యంలో మరో భారీ యుద్ధం తప్పదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా తన అమ్ములపొదిలోని అస్త్రాలన్నింటినీ సిద్ధం చేసి ఉంచినట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరాన్పై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..