PM Modi : ఈ రోజుల్లో నమ్మకమే అసలైన ఆస్తి.. జీ7 సదస్సులో ప్రపంచానికి ప్రధాని మోదీ కీలక సందేశం

నేటి ఆధునిక ప్రపంచంలో ఏ ఒక్క దేశపు భద్రత, శ్రేయస్సు కేవలం ఆ దేశ సరిహద్దులకే పరిమితం కాలేదని, ప్రపంచ దేశాల మధ్య పరస్పర నమ్మకం మాత్రమే అతిపెద్ద వ్యూహాత్మక ఆస్తిగా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జీ-7 అంతర్జాతీయ సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా తనకు, భారత ప్రతినిధి బృందానికి ఘన స్వాగతం పలికిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌కు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

PM Modi : ఈ రోజుల్లో నమ్మకమే అసలైన ఆస్తి.. జీ7 సదస్సులో ప్రపంచానికి ప్రధాని మోదీ కీలక సందేశం
Pm Modi G7 Summit Speech 2026

Updated on: Jun 17, 2026 | 9:09 AM

నేటి ప్రపంచం గతంలో కంటే ఎంతో ఎక్కువగా ఒకదానితో ఒకటి అనుసంధానమై, పరస్పరం ఆధారపడి ఉందనే విషయాన్ని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఇంధనం, ఆహారం, సైబర్, ఆర్థిక రంగాలు దేశాల సరిహద్దులను దాటి విస్తరించాయని, డేటా, మూలధనం, సాంకేతికత మనల్ని నిరంతరం కలుపుతాయని చెప్పారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాలు చాలా ముఖ్యమని మోదీ అన్నారు. అయితే ఈ భాగస్వామ్యాలు బలంగా ఉండాలంటే నమ్మకం అవసరమని ఆయన అన్నారు. సాంకేతికతను, గ్లోబల్ సప్లై చైన్‌లను కొన్ని దేశాలు తమ స్వార్థం కోసం ఆయుధాలుగా మార్చుకోకూడదని, వాటిని ప్రపంచ శ్రేయస్సు కోసం మాత్రమే ఉపయోగించాలనే నమ్మకాన్ని అన్ని దేశాల్లో పెంపొందించాలని కోరారు. భాగస్వామ్యానికి నిజమైన పరీక్ష మనం ఇతరుల కోసం ఏమి నిర్మించామనేది కాదు, వారు తమ కోసం తాము నిర్మించుకునేలా మనం వారిని ఎంతవరకు సమర్థులను చేశామనేదేని ప్రధాని మోదీ అన్నారు.

గత శతాబ్దంలో మానవాళి రెండు ప్రపంచ యుద్ధాల వల్ల భారీ నష్టాన్ని చవిచూసిందని, ఎన్నో త్యాగాల తర్వాతే నేటి అంతర్జాతీయ శాంతి భద్రతల వ్యవస్థలు ఏర్పడ్డాయని ప్రధాని వివరించారు. కానీ, దశాబ్దాలుగా నిర్మించుకున్న ఆ నమ్మకం నేడు సడలుతోందని, కోవిడ్ సంక్షోభం ప్రపంచ దేశాల సంఘీభావం లోని డొల్లతనాన్ని అద్దం పట్టి చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ప్రపంచంలో వనరుల కొరత లేదని, కేవలం నమ్మకపు కొరత మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ చెప్పిన నమ్మండి, కానీ ధృవీకరించుకోండి అనే సూత్రం నేటికీ అభినందించదగినదేనన్నారు. రాబోయే తరాల కోసం ఒక పటిష్టమైన, నిబంధనలతో కూడిన ప్రపంచ వ్యవస్థను నిర్మించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ప్రధాని మోదీ అన్నారు.

భారతదేశం ఎల్లప్పుడూ వసుధైక కుటుంబకం అనే భావనతో ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా చూస్తోందని మోదీ తెలిపారు. మన దేశ విధానాలన్నీ సర్వజన హితాయ, సర్వజన సుఖాయ అనే మూల సిద్ధాంతంపైనే సాగుతున్నాయన్నారు. అభివృద్ధి అనేది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నప్పుడే ఫలితాలు ఇస్తుందని భారత్ నిరూపించిందన్నారు. అంతర్జాతీయ సౌర కూటమి (ISA), విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి (CDRI), గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్, మిషన్ లైఫ్, “ఏక్ పేడ్ మా కే నామ్ వంటి పర్యావరణ అనుకూల ప్రపంచ స్థాయి కార్యక్రమాలను భారత్ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోందని వివరించారు.

ప్రపంచంలో ఎక్కడ ఏ విపత్తు వచ్చినా భారత్ తొలుత స్పందిస్తుందని మోదీ అన్నారు. కోవిడ్ సమయంలో 150కి పైగా దేశాలకు మందులు, వ్యాక్సిన్లు అందించామని, శ్రీలంక తుఫాను, ఆఫ్ఘనిస్తాన్ భూకంపం, మొజాంబిక్ వరదలు, క్యూబా-జమైకాలలో హరికేన్ సంభవించినప్పుడు మానవత్వమే మొదటి ప్రాధాన్యత అనే సూత్రంతో సహాయం అందించామన్నారు. భాగస్వామ్య దేశాల్లో కేవలం సహాయం అందించడమే కాకుండా, వారి స్వయం సమృద్ధి కోసం సామర్థ్య పెంపొందింపు నైపుణ్యాభివృద్ధిపై భారత్ దృష్టి సారించిందని స్పష్టం చేశారు.

గ్లోబల్ సౌత్ దేశాలు సమాజం నుండి సహాయాన్ని ఆశించడం లేదని, కేవలం సమాన భాగస్వామ్యాన్ని మాత్రమే కోరుకుంటున్నాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మనం పాత దాత-గ్రహీత ఆలోచనా విధానాన్ని వీడాలని.. భాగస్వామ్యాన్ని పరాధీనతతో కాకుండా, ఆత్మగౌరవంతో ముందుకెళ్లాలని అని పిలుపునిచ్చారు.

ఇక పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలపై స్పందిస్తూ.. యుద్ధాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయని, హార్ముజ్ జలసంధిలో సముద్ర వ్యాపారానికి ఆటంకం కలగడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే చర్చలు, దౌత్యం ద్వారానే శాశ్వత పరిష్కారం సాధ్యమని, సముద్ర మార్గాల్లో నావికులకు పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజంపై ఉందని ప్రధాని మోదీ అన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us