Sri Lanka Crisis: కప్పు టీ, కిలో టమోటా, కేజీ మిర్చి, కేజీ యాపిల్‌ ధరలు ఎంతో తెలిస్తే బిత్తరపోవాల్సిందే..!

Sri Lanka Crisis: అక్కడి ధర మోతతో ప్రజలు విలవిలలాడుతున్నారు. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు ఏమి చేయలో తెలియని పరిస్థితి నెలకొంది. కప్పు టీ 100, కిలో..

Sri Lanka Crisis: కప్పు టీ, కిలో టమోటా, కేజీ మిర్చి, కేజీ యాపిల్‌ ధరలు ఎంతో తెలిస్తే బిత్తరపోవాల్సిందే..!

Updated on: Apr 09, 2022 | 5:40 AM

Sri Lanka Crisis: అక్కడి ధర మోతతో ప్రజలు విలవిలలాడుతున్నారు. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు ఏమి చేయలో తెలియని పరిస్థితి నెలకొంది. కప్పు టీ 100, కిలో టమోటా 200, కిలో అల్లం 250, కేజీ మిర్చి 500, కేజీ యాపిల్‌ 1000 ఇవి నెంబర్లు కాదు.. దడ పుట్టిస్తున్న నిత్యావసరాల ధరలు.. ఇక సామాన్యుడు బతికేదెట్ల.. శ్రీలంకలో తలెత్తిన ఆర్ధిక, రాజకీయ సంక్షోభం ప్రజల పాలిట శాపంగా మారింది. కోట్లాది మంది ప్రజల తలరాతలను ప్రశ్నార్ధకం చేసింది.అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంక (Sri Lanka).. అందులోంచి బయటకు రాలేక అల్లాడిపోతోంది. భారత్‌, చైనా, జపాన్‌ అంతర్జాతీయ ద్రవ్యనిధికి విదేశీ మారకద్రవ్య నిల్వలు లేకపోవడంతో.. అప్పుల వాయిదా చెల్లించలేని పరిస్థితికి చేరుకుంది లంక సర్కార్‌. 3 లక్షల 50వేల కోట్ల అప్పుల్లో ఉన్న శ్రీలంక ప్రభుత్వానికి .. వాటిని తీర్చడం గగనంగా మారింది. విదేశీ అప్పులు తీర్చుతూనే దేశ ప్రజల కష్టాలను తీర్చాలి. కానీ పరిస్థితులు చేయి దాటిపోవడంతో ఇప్పుడా దేశం.. అన్నిదేశాలను దేహీ అని అభ్యర్ధించే స్థితికి చేరింది.

అప్పుల ఊబిలోకి..

కరోనా ఎఫెక్ట్‌తో దేశంలో పేదరికం బాగా పెరిగిపోతూ వచ్చింది. దీనికితోడు చాలా కుటుంబాలు తినడానికి తిండికి కూడా నోచుకోని దుస్థితికి చేరుకున్నాయి. ఉపాధి కోల్పోయిన వారు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. దీనికితోడు రెండు దశాబ్దాలుగా చైనాతో జతకడుతూ వచ్చిన శ్రీలంక.. దేశంలో చేపట్టిన ప్రాజెక్టుల కోసం పెద్ద ఎత్తున అప్పులను తీసుకుంది. చాలా వాటిలో చైనా పెట్టుబడులను కూడా పెట్టింది. సహాయం పేరుతో చైనా.. శ్రీలంకను అప్పుల ఊబిలోకి దించుతోందన్న ఆరోపణలు వచ్చినా పాలకులు పట్టించుకోలేదు. చివరకు అదే నిజమైంది. నిండా మునిగి అప్పులతో కోలుకోలేకుండా మారింది.

తీసుకున్న అప్పుల ప్రకారం ఏటా శ్రీలంక.. 52,916 కోట్ల రుణాలను చెల్లించాలి. కానీ విదేశీ మారక ద్రవ్య నిల్వలు.. 17,386 కోట్లే ఉన్నాయి. తీర్చే పరిస్థితి లేకుండా పోవడంతో.. చేతులెత్తేసే పరిస్థితికి వచ్చింది. ప్లీజ్‌ ఆదుకోండని చైనాను అడిగినా ఆ దేశం సరిగా రియాక్ట్‌ కావడం లేదు. ముందు పాత బకాయిల లెక్కలు తేల్చుకున్నాకే రావాలని అంటోంది. ఈ నేపథ్యంలో శ్రీలంకలో పరిస్థితులు మరింత దిగజారుతూ వచ్చాయి.

బెడిసి కొట్టిన చైనాతో దోస్తీ..

భారత్‌ కన్నా చైనాతో దోస్తీ తమకు మంచే చేస్తుందనుకుంది శ్రీలంక. కానీ అదే బెడిసికొట్టింది. తమ రాజకీయాల్లో చైనా జోక్యం చేసుకోదని అనుకున్నప్పటికీ.. ఆ దేశం ఇచ్చిన అప్పులు మొదటికే మోసమయ్యేలా చేసింది. ప్రభుత్వానికే ఎసరు తెచ్చేలా చేసింది. చట్టసభ్యులు కూడా రాజీనామాలు చేయడంతో.. సర్కార్‌ వైఫల్యంపై జనం ఆగ్రహజ్వాలలు ఎగిసిపడేలా చేశాయి.

ఇవి కూడా చదవండి:

Power Holiday Effect: విశాఖను వణికిస్తోన్న పవర్‌హాలీడే.. పారిశ్రామికవేత్తల నుంచి వ్యతిరేకత..!

Sri Lanka Crisis: శ్రీలంకలో తెలుగువారి అవస్థలు.. దినదిన గండంగా మారిన బతుకుదెరువు

Loading...
Unable to load recommendations.
Follow Us