
రష్యా అన్నంత పనిచేసింది. ఉక్రెయిన్పై కసి తీర్చుకుంటున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఉక్రెయిన్ రాజధాని కీవ్తో సహా పలు నగరాలపై ఏకకాలంలో విరుచుకుపడ్డాయి రష్యా బలగాలు. మిస్సైల్ దాడిలో పలువురు చనిపోయారు. కీవ్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కార్యాలయం మీద కూడా మిస్సైల్ దాడి జరిగింది. క్రిమియా బ్రిడ్జి పేల్చివేతకు ప్రతీకారంగా ఉక్రెయిన్ లోని పలు వంతెనలను పేల్చి వేసింది రష్యా. క్షిపణి దాడుల్లో రెండు పవర్స్టేషన్లు కూడా ధ్వంసమయ్యాయి. కీవ్పై ఒకేసారి 75 క్షిపణులతో దాడి చేసింది రష్యా. దీంతో అపారనష్టం జరిగింది. కీవ్ లోనే రష్యా దాడిలో మరణించిన వారి సంఖ్య 10మందికి చేరింది. సుమారు 60 మందికి తీవ్రగాయాలయ్యాయి. చాలా కార్లు ధ్వంసమయ్యాయి.
క్రిమియా బ్రిడ్జి పేల్చివేత ముమ్మాటికి ఉగ్రవాద చర్య అన్న పుతిన్, రష్యాకు వ్యతిరేకంగా ఇలాగే దాడులు కొనసాగిస్తే తమ రియాక్షన్ మరింత కఠినంగా ఉంటుందని హెచ్చరించారు. కీవ్ సిటీ సెంటర్ను టార్గెట్ చేస్తూ కూడా రష్యా క్షిపణి దాడులు జరిగాయి. కీవ్పై దాడులకు రష్యా బలగాలు ఇరాన్ డ్రోన్లను కూడా ఉపయోగించినట్టు చెబుతున్నారు. కీవ్, లీవ్, జెఫోరిజ్జియాతో సహా 12 నగరాలపై ఒకేసారి దాడులు చేసింది రష్యా. రష్యా దాడులపై స్పందించారు జెలెన్స్కీ భూమి మీద ఉక్రెయిన్ పౌరులను లేకుండా చేయాలని పుతిన్ కుట్ర చేశారని ఆరోపించారు. ఉక్రెయిన్ పవర్ప్లాంట్లను టార్గెట్ చేస్తూ రష్యా దాడులు చేసిందన్నారు.
ఇదిలాఉంటే, రష్యా -ఉక్రెయిన్లో తాజా ఉద్రిక్తతలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యుద్దంతో సమస్య పరిష్కారం కాదని ఇరుదేశాలు చర్చలకు ముందుకు రావాలని భారత విదేశాంగశాఖ విజ్ఞప్తి చేసింది. ఉక్రెయిన్కు భారతీయులు వెళ్లవద్దని కూడా కేంద్రం సూచించింది. ఉక్రెయిన్లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని , తమ సమాచారాన్ని కీవ్ లోని భారత ఎంబసీకి తెలపాలని కోరారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..