
భారత సంతతి బిలియనీర్, ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్కు చెందిన ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ను రష్యా క్షిపణి తాకింది. ఉక్రెయిన్లోని క్రివి రిహ్ ప్రాంతంలోని ఉక్కు ఉత్పాదక కేంద్రంపై జరిగిన రష్యా క్షిపణి దాడిలో ఇద్దరు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోగా, 14 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షిపణి దాడిలో ప్లాంట్లోని కోర్ ఎనర్జీ వ్యవస్థ, బ్లాస్ట్ ఫర్నేస్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాంతో ఉత్పత్తిని పాక్షికంగా నిలిపివేసారు.
ఉక్రెయిన్లోని అతిపెద్ద భారతీయ స్టీల్ ప్లాంట్పై రష్యా క్షిపణి దాడి చేసింది. క్రివీ రిహ్లోని భారతీయ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్కు చెందిన ఆర్సెలర్ మిట్టల్ ప్లాంట్పై జరిగిన దాడిలో ఇద్దరు మృతి చెందగా 14 మంది ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బందికి గాయాలయ్యాయి. అంతేకాకుండా ప్లాంట్కు కీలకమైన ఎనర్జీ ఇంకా బ్లాస్ట్ ఫర్నేస్ విభాగాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాడి కారణంగా ప్లాంట్ ఉత్పత్తిని పాక్షికంగా నిలిపివేసారు. సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా దాడిలో స్టీల్ ప్లాంట్కు కలిగిన నష్ట తీవ్రత పై నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉత్పత్తి పునరుద్ధరణకు ఎంత సమయం పడుతుందో పరిశీలిస్తున్నారు. క్షిపణి దాడి ఘటనను సంస్థ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఇది పౌర పారిశ్రామిక భాగస్వామ్యంతో నడుస్తున్న సంస్థ అనీ ఆర్సెలర్ మిట్టల్ ఒక ప్రకటనలో తెలిపింది. లక్ష్మీ మిట్టల్ సంస్థ.. ఉక్రెయిన్లో అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారుగా పేరు పొందింది.
నాలుగేళ్లుగా కొనసాగుతోన్నయుద్ధంతో రష్యా-ఉక్రెయిన్ దేశాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఇటీవల రష్యాలోని సైనిక పరిశ్రమలను ఇంధన సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది కీవ్. దాంతో పుతిన్ ప్రభుత్వం ఇంధన కొరతతో అల్లాడుతోంది. తాజాగా ఉక్రెయిన్ , రష్యా భూభాగంపై వందలాది డ్రోన్లతో విరుచుకుపడింది. దాడిలో కనీసం ఆరుగురు రష్యన్లు మరణించారు. దాదాపు 822 ఉక్రెయిన్ డ్రోన్లను రష్యన్ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. మాస్కో వైపు డ్రోన్లు దూసుకురాగా అందులో మూడో వంతు డ్రోన్లను కూల్చివేశామని మేయర్ సెర్గీ సోబ్యానిన్ వెల్లడించారు. ఈ ప్రతీకార దాడుల పరంపరతో తూర్పు ఐరోపాలో యుద్ధ వాతావరణం మరింత సంక్షోభంలోకి జారుకుంది.