
ఉత్తర కొరియాలో స్మార్ట్ఫోన్ల పనితీరుపై వస్తున్న కథనాలు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి.స్మార్ట్ఫోన్ల పనితీరుపై వస్తున్న కథనాలు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. మనం వాడే ఫోన్లు మన పనులను సులభతరం చేస్తే, అక్కడ వాడే ఫోన్లు మాత్రం ప్రజలను వేటాడే వేగుల్లా మారుతున్నాయి. యూజర్ ఏం చేస్తున్నాడనేది ఎప్పటికప్పుడు స్క్రీన్ షాట్ల రూపంలో భద్రపరిచి, ప్రభుత్వం తనిఖీ చేసేలా ఈ టెక్నాలజీని డిజైన్ చేశారు. ఇదొక జేబులో ఇమిడిపోయే నిఘా వ్యవస్థలా పనిచేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ ఫోన్ల ప్రధాన ఉద్దేశం సమాచార మార్పిడి కంటే నిఘా పెట్టడమే అని నిపుణులు చెబుతున్నారు. వినియోగదారుడు తనకు తెలియకుండానే నిరంతరం నిఘా నీడలో ఉంటాడు. ఫోన్ దానంతట అదే ఆటోమేటిక్ స్క్రీన్ షాట్లను తీసి ఒక ఫోల్డర్లో భద్రపరుస్తుంది. ఆ ఫోల్డర్ను యూజర్ చూడగలడు కానీ, అందులోని ఫైళ్లను డిలీట్ చేయడం కానీ, ఓపెన్ చేయడం కానీ సాధ్యం కాదు. అంటే, మీరు ఏ సమయంలో ఏ వెబ్సైట్ చూశారు లేదా ఎవరితో ఏం మాట్లాడారనే దానికి అది తిరుగులేని సాక్ష్యంగా మారుతుంది.
కేవలం నిఘా పెట్టడమే కాకుండా, ప్రజల ఆలోచనలను కూడా నియంత్రించేలా ఈ ఫోన్ సాఫ్ట్వేర్ రూపొందించబడింది. గ్లోబల్ ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో పాటు, టైప్ చేసేటప్పుడు కొన్ని పదాలను అది అంగీకరించదు. రాజకీయంగా సున్నితమైన లేదా ప్రభుత్వానికి వ్యతిరేకమైన పదాలను టైప్ చేస్తుంటే, ఫోన్ వాటిని ఆటోమేటిక్గా మార్చేస్తుంది. అంటే మీరు ఏం రాయాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నమాట.
దీనివల్ల అక్కడి ప్రజలు కనీస భావప్రకటన స్వేచ్ఛను కోల్పోతున్నారు. ఒక పరికరంగా ఉండాల్సిన ఫోన్, ఒక చెక్పోస్ట్లా మారి ప్రతి అడుగును తనిఖీ చేస్తోంది. ముందుగా భాషను మారుస్తుంది, ఆ తర్వాత మీరు ఏం చేశారనే దానికి సాక్ష్యాలను భద్రపరుస్తుంది. ఈ తరహా టెక్నాలజీ నియంతృత్వ పోకడలకు పరాకాష్ట అని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఉత్తర కొరియా తన పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి టెక్నాలజీ సాకుతో చొరబడి, వారిని బందీలను చేస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.