
కరోనా లాంటి భయంకరమైన మహమ్మారిని చూసిన ప్రపంచపైకి మరో మహమ్మారి దూసుకొస్తోంది. ఇప్పటికే 50 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడి కేవలం 48 గంటల్లోనే మరణించారు. ఈ వ్యాధి ఏంటనేది ఇంకా వైద్యులు కూడా గుర్తించలేదు. దీంతో ఒక్కసారిగా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. వెస్ట్రన్ కాంగోలో ఈ అరుదైన, భయంకరమైన వైరస్ వ్యాప్తిని గుర్తించారు. ఐదు వారాల క్రితం గబ్బిలం తిన్న ముగ్గురు పిల్లలలో మొదట ఈ వ్యాధి సోకింది. ఆ తర్వాత మరికొంత మందికి చాలా వేగంగా వ్యాపించింది. వారిలో ఇప్పటికే 50 మందికి పైగా మరణించినట్లు సమాచారం. ఈ వ్యాధి లక్షణాలు.. జ్వరం, వాంతులు, అంతర్గత రక్తస్రావం(ఇంటర్నల్ బ్లీడింగ్) వంటివి కనిపిస్తాయి.
ఈ లక్షణాలు కనిపించిన 48 గంటల్లోనే మృత్యువు సంభవిస్తోందని బికోరో హాస్పిటల్ డైరెక్టర్ సెర్జ్ న్గలేబాటో తెలిపారు. సాధారణంగా ఈ “రక్తస్రావ జ్వరం” లక్షణాలు ఎబోలా, డెంగ్యూ, మార్బర్గ్, ఎల్లో ఫీవర్ వంటి ప్రాణాంతక వైరస్లతో ముడిపడి ఉంటాయి, కానీ ఇప్పటివరకు సేకరించిన డజనుకు పైగా నమూనాల పరీక్షల్లో అవేవి కావని నిర్ధారణ అయినట్లు పరిశోధకులు చెబుతున్నారు. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఈ వ్యాధి వ్యాప్తి జనవరి 21న ప్రారంభమైంది. ఇప్పటి వరకు 419 కేసులు నమోదయ్యాయి, 53 మరణాలు సంభవించాయని అధికారులు తెలియజేశారు.
బోలోకో గ్రామంలో ముగ్గురు పిల్లలు గబ్బిలం తిని 48 గంటల్లోపు మరణించిన తర్వాత ఈ వ్యాప్తి ప్రారంభమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆఫ్రికా కార్యాలయం సోమవారం తెలిపింది. ఫిబ్రవరి 9న బోమాటే గ్రామంలో ఈ మిస్టరీ వ్యాధి రెండవసారి వ్యాప్తి చెందిన తర్వాత, 13 మందిని నుంచి రక్త నమూనాలను సేకరించి, కోసం కాంగో రాజధాని కిన్షాసాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్కు పంపినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అన్ని నమూనాలు సాధారణ హెమరేజిక్ జ్వరం వ్యాధులకు ప్రతికూలంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే కొన్నింటికి మలేరియా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఈ వ్యాధి పేరు కానీ, వైరస్ పేరు కానీ సైంటిస్టులు కనిపెట్టలేదు. దీన్ని అడ్డుకోకపోతే మరింత మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.