PM Modi: ప్రధాని మోదీకి ట్రంప్ షేక్ హ్యాండ్.. G7 సదస్సులో ఆసక్తికర సీన్.. వీడియో వైరల్..

ప్రపంచాన్ని శాసించే ఇద్దరు పవర్‌ఫుల్ లీడర్లు ఫ్రాన్స్ వేదికగా కలుసుకున్నారు. 16 నెలల గ్యాప్ తర్వాత జీ7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకరినొకరు కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరు నేతలు చిరునవ్వులతో షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

PM Modi: ప్రధాని మోదీకి ట్రంప్ షేక్ హ్యాండ్.. G7 సదస్సులో ఆసక్తికర సీన్.. వీడియో వైరల్..
Pm Modi And Donald Trump Meet At G7 In France

Updated on: Jun 16, 2026 | 7:43 PM

ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలుసుకున్నారు. సదస్సు వేదికపై ఇరు దేశాల అధినేతలు ఎంతో ఆప్యాయంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. దాదాపు 16 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరు ప్రపంచ అగ్రనేతలు ఇలా ఒకే వేదికపై కలుసుకోవడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ చిరునవ్వుతో ట్రంప్‌ను పలకరించి, కరచాలనం చేసిన అనంతరం ఇరువురు నేతలు ఇతర ప్రపంచ దేశాల నాయకులతో కలిసి సదస్సులో పాల్గొన్నారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. గత ఏడాది ప్రధాని మోదీ వాషింగ్టన్ పర్యటనకు వెళ్లారు. ఆ తర్వాత వీరిద్దరూ ముఖాముఖి కలవడం ఇదే తొలిసారి. ఇటీవలి కాలంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్, అలాగే భారతీయ వస్తువులపై ట్రంప్ విధించిన టారిఫ్‌ల వల్ల ఇరు దేశాల సంబంధాల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి కలయిక, షేక్ హ్యాండ్ అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.

జీ7 వేదికగా మోదీ మార్క్ దౌత్యం..

రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్‌లోని ఎవియాన్ చేరుకున్న ప్రధాని మోదీ షెడ్యూల్ అత్యంత బిజీగా సాగుతోంది. జీ7 కూటమిలో భారత్‌కు అధికారిక సభ్యత్వం లేకపోయినప్పటికీ, భారత్ వరుసగా 7వ సారి ఈ సదస్సుకు హాజరవుతుండటం గ్లోబల్ పాలిటిక్స్‌లో ఇండియా ఎదుగుతున్న సత్తాకు నిదర్శనం. సదస్సు ముగింపు అనంతరం సాయంత్రం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇచ్చే ప్రత్యేక గాలా డిన్నర్‌లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. అంతకంటే ముందు పలు దేశాల ప్రధానులతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

సదస్సు అజెండా ఏంటి?

ఈ ఏడాది జీ7 సదస్సులో ప్రపంచ ఆర్థిక స్థిరత్వం, ఎనర్జీ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే ఉక్రెయిన్ – మిడిల్ ఈస్ట్‌లలో సాగుతున్న సుదీర్ఘ యుద్ధాలు, భౌగోళిక రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అయితే ఈ వేదిక ద్వారా భారత్ గ్లోబల్ సౌత్ సమస్యలను ప్రపంచ దేశాల ముందు ఉంచనుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలపై పడుతున్న ఆర్థిక, ఇంధన భారాలపై గ్లోబల్ లీడర్ల మధ్య గట్టిగా వాయిస్ వినిపించడానికి న్యూఢిల్లీ ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోనుంది.

వీడియో చూడండి..

Follow Us