
ప్రపంచ రాజకీయాలు అత్యంత సంక్లిష్ట దశలో ఉన్న వేళ భారత్ మరోసారి తన సమతుల్య విదేశాంగ విధానాన్ని చాటుకుంది. ఒకవైపు ఇరాన్ అత్యున్నత నాయకుడు అలీ ఖామెనీ అంత్యక్రియలకు భారత అధికారిక ప్రతినిధి బృందాన్ని పంపగా.. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్ను తమకు అత్యంత బలమైన మద్దతుదారుల్లో ఒకటిగా అభివర్ణించడం అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారింది.
అలీ ఖామెనీ మరణం అనంతరం టెహ్రాన్లో జరిగిన అంత్యక్రియలకు భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గెరిటా, బీహార్ గవర్నర్ సయ్యద్ అటా హస్నైన్ హాజరయ్యారు. మాజీ విదేశాంగ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ కూడా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం, ప్రజలకు ఇరాన్ రాయబార కార్యాలయం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.
భారత్ చూపిన స్నేహభావం, గౌరవాన్ని ఇరాన్ ప్రజలు ఎప్పటికీ మరచిపోరని పేర్కొంటూ, రెండు దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, మానవీయ బంధాలకు ఇది నిదర్శనమని ఇరాన్ ఎంబసీ సోషల్ మీడియా వేదిక ఎక్స్లో వెల్లడించింది. భారత్ నుంచి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, మేధావులు, వివిధ మతాల ప్రతినిధులు హాజరు కావడం ద్వైపాక్షిక సంబంధాల బలాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొంది.
ఇదే సమయంలో అమెరికా అంత్యక్రియలకు దేశాలు హాజరుకాకుండా దౌత్యపరంగా ఒత్తిడి తెచ్చిందని ఇరాన్కు చెందిన తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ ఆరోపించింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, పలు దేశాల్లోని అమెరికా రాయబారులు ప్రభుత్వాలతో సంప్రదించి అంత్యక్రియలకు దూరంగా ఉండాలని సూచించినట్లు ఆ కథనం పేర్కొంది. అయితే ఈ ఆరోపణలపై అమెరికా ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా భారత్పై ప్రశంసలు కురిపించారు. భారత్ తమకు అపారమైన మద్దతు ఇస్తోందని, 140 కోట్ల జనాభా ఉన్న దేశం నుంచి లభిస్తున్న ఆదరణ విశేషమని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలతో ఇజ్రాయెల్కు బలమైన సంబంధాలు ఉన్నప్పటికీ భారత్ మద్దతు ప్రత్యేకమని ఆయన పేర్కొన్నారు.
ఈ పరిణామాలు భారత్ విదేశాంగ విధానంలోని ప్రత్యేకతను మరోసారి స్పష్టంచేస్తున్నాయి. ఇరాన్తో చారిత్రక సంబంధాలను కొనసాగిస్తూనే, ఇజ్రాయెల్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కూడా బలోపేతం చేస్తూ న్యూఢిల్లీ సమతుల్య దౌత్యాన్ని కొనసాగిస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ఏ ఒక్క వర్గానికి పూర్తిగా మొగ్గు చూపకుండా, జాతీయ ప్రయోజనాలను కేంద్రంగా పెట్టుకుని సంబంధాలను నిర్వహించడం భారత్ విదేశాంగ విధానానికి బలమైన గుర్తింపుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
సంక్షోభ సమయాల్లో భావోద్వేగాల కంటే దౌత్యానికి ప్రాధాన్యం ఇస్తూ, అన్ని పక్షాలతో సంభాషణలు కొనసాగించే సామర్థ్యాన్ని భారత్ మరోసారి ప్రదర్శించింది. అదే సమయంలో ప్రపంచంలోని ప్రధాన శక్తులతో సమతుల్య సంబంధాలను కొనసాగించడం ద్వారా బాధ్యతాయుత గ్లోబల్ శక్తిగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.