
నిజ్జర్ హత్య, ట్రూడో వ్యాఖ్యల తర్వాత ఇండియా-కెనడా మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కెనడాలో మనవాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పుడు నిజ్జర్ తరహాలోనే మరో ఖలిస్తానీ తీవ్రవాది తెరమీదికొచ్చాడు. కెనడాలో హిందువుల్ని చూపుడువేలితో హెచ్చరించాడు. దీనికి ఘాటుగానే స్పందించింది భారత ప్రభుత్వం. ట్రూడో వ్యాఖ్యలతో ఇప్పటికే కెనడా-ఇండియాల మధ్య అగాధం ఏర్పడింది. దౌత్య సంబంధాలు సందేహాస్పదంగా మారాయి. ఇప్పుడు ఖలిస్థానీ తేనెతుట్టెను మళ్లీ కదిపాడు.. గుర్పత్వంత్ సింగ్ పన్ను అనే కెనడా బేస్డ్ సిక్కు తీవ్రవాది.
నిషేధిత ఖలిస్థానీ ఆర్గనైజేషన్కి సహ వ్యవస్థాపకుడిగా చెలామణీ ఔతున్న గుర్పత్వంత్… కెనడాలో ఉంటున్న హిందువులపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కెనడా రాజ్యాంగం మీద విశ్వాసం లేని మీరంతా ఆ దేశాన్ని వదిలిపొండి.. ఇండియాకు వెళ్లిపోండి అంటూ ఆయన చేసిన కామెంట్… వివాదాస్పదమౌతోంది. అటు.. నిజ్జర్ హత్యకు ఇండియన్ హైకమిషనర్ వర్మ బాధ్యత వహించాలా వద్దా అంటూ ఒపీనియన్ పోల్ పెట్టాడు. ఇలా వివాదాస్పద చేతలతో చెలరేగిపోతున్న గుర్పత్వంత్పై చర్యలకు దిగింది భారత ప్రభుత్వం.
కెనడాలో స్థిరపడ్డ ఖలిస్థాన్ టెర్రరిస్టులపై ఉక్కుపాదం మోపింది మోదీ సర్కార్. హర్దీప్ సింగ్ నిజ్జర్, గుర్పత్వంత్ పన్నుకు చెందిన ఆస్తుల్ని జప్తు చేసింది. చండీఘర్, అమృత్సర్, జలంధర్లో మెరుపుదాడులు చేసి.. వాళ్ల ఆస్తుల్ని సీజ్ చేసింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. రెండు ఖరీదైన స్థలాల్లో జప్తు సంబంధిత హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు ఎన్ఐఏ అధికారులు. ఈ విధంగా కెనడాలోని ఖలిస్థాన్ తీవ్రవాదుల పట్ల తమ వైఖరి ఎంత కఠినంగా ఉండబోతుందో గట్టి సంకేతాలిచ్చింది భారత ప్రభుత్వం.
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు కెనడియన్ మీడియా నిర్వహించిన సర్వేలో ప్రధాని రేసులో ట్రూడో వెనుకబడినట్లు తెలుస్తోంది. ఈ సర్వే ప్రకారం, కెనడియన్లు తదుపరి ఎన్నికలలో ప్రధానమంత్రి పదవికి ట్రూడో కంటే ప్రతిపక్ష నాయకుడు పియరీ పోయిలీవ్రే ఎక్కువ అర్హత కలిగి ఉన్నారని భావిస్తున్నారు. కెనడాలో సార్వత్రిక ఎన్నికలకు ముందు వచ్చిన ఈ సర్వే ట్రూడో, అతని లిబరల్ పార్టీ మధ్య టెన్షన్ను పెంచబోతోంది.
కెనడా గ్లోబల్ న్యూస్ కోసం IPSOS నిర్వహించిన ఒక సర్వేలో 39% మంది కెనడియన్లు ప్రతిపక్ష నాయకుడు పియరీ పోయిలీవ్రేను ప్రధానమంత్రి పదవికి అర్హులుగా భావించారు. అయితే ట్రూడోకు అనుకూలంగా 30% ఓట్లు మాత్రమే పడ్డాయి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో ఈ సర్వే జరిగింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం