Bangladesh Crisis: బంగ్లాలో రెచ్చిపోయిన అల్లరిమూక.. 24 మంది సజీవదహనం! వీడియో వైరల్

|

Aug 07, 2024 | 8:47 AM

బంగ్లాదేశ్‌ రణరంగంగా మారింది. అక్కడ నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తున్నాయి. మరోవైపు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఆర్థికవేత్త ముహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మంగళవారం రాత్రి పగ్గాలు చేపట్టారు. అయితే అవామీ లీగ్ పార్టీ అధినేత్రి షేక్‌ హసీనా రాజీనామా అనంతరం ఆ పార్టీ నేతల ఇళ్లు, వ్యాపారాలను ధ్వంసం..

Bangladesh Crisis: బంగ్లాలో రెచ్చిపోయిన అల్లరిమూక.. 24 మంది సజీవదహనం! వీడియో వైరల్
fire accident at Bangladesh hotel
Follow us on

ఢాకా, ఆగస్టు 7: బంగ్లాదేశ్‌ రణరంగంగా మారింది. అక్కడ నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తున్నాయి. మరోవైపు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఆర్థికవేత్త ముహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మంగళవారం రాత్రి పగ్గాలు చేపట్టారు. అయితే అవామీ లీగ్ పార్టీ అధినేత్రి షేక్‌ హసీనా రాజీనామా అనంతరం ఆ పార్టీ నేతల ఇళ్లు, వ్యాపారాలను ధ్వంసం చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీకి చెందిన ఓ నేత స్టార్‌ హోటల్‌కి అల్లరిమూక నిప్పంటించారు. జోహోర్‌ జిల్లాలో అవామీ లీగ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి షహిన్‌ ఛక్లదర్‌కు చెందిన జబీర్‌ ఇంటర్నేషన్‌ హోటల్‌లో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 24 మంది సజీవంగా దహనమయ్యారు. మృతుల్లో ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తి కూడా ఉన్నాడు. పలువురు హోటల్‌ సిబ్బంది తీవ్రంగా గాయపడగా.. వారంతా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఓ గుర్తుతెలియని గుంపు హోటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో నిప్పంటించారు. అది వేగంగా పై అంతస్తులకు వ్యాపించింది. ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా పలుచోట్ల చోటు చేసుకున్నాయి. ముష్కరులు బంగబంధు అవెన్యూలోని పార్టీ కేంద్ర కార్యాలయంతో సహా అనేక మంది అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తల ఇళ్లు, వ్యాపార సంస్థలు ఏకకాలంలో లక్ష్యంగా చేసుకుని, హింసకు పాల్పడ్డారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారింది. అక్కడ చెలరేగిన హింసలో ఇప్పటి వరకు 440 మందికిపైగా మరణించారు.

ఇవి కూడా చదవండి

గత రెండు రోజుల్లోనే పోలీసులు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో దాదాపు 250 మందికి పైగా మరణించి ఉంటారని స్థానిక మీడియా పేర్కొంది. సోమవారం హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్‌లో హింస మరింత పెరిగింది. హసీనా నిష్క్రమణ వార్త వ్యాపించడంతో ఢాకాతోపాటు ఇతర ప్రాంతాలు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ ఆస్తులను, హసీనా అధికారిక నివాసాన్ని కూడా ధ్వంసం చేశారు. ఇప్పటి వరకు 11 వందల మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా 1971 స్వాతంత్ర్య సమర యోధుల వారసులకు ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్‌ కేటాయించడంపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.