
లండన్, మార్చి 12: ప్రపంచవ్యాప్తంగా అరటిపండ్ల ధరలు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావం వల్ల ఈ పండ్ల ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. తాజాగా ఈ పరిశ్రమకు చెందిన నిపుణులు అరటిపండ్ల దిగుమతిపై ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. వరల్డ్ బనానా ఫోరమ్కు చెందిన సీనియర్ ఎకానమిస్ట్ పాస్కల్ లియూ మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల వల్ల అరటిపండ్ల సరఫరాపై అపార ప్రభావం పడినట్లు తెలిపారు. దీనికి తోడు అరటి పండ్ల పంటకు సోకే వ్యాధులు కూడా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ఆయన తెలిపారు. సముద్ర తుఫానుల కారణంగా ఇటీవల యూకేలో అరటి పండ్ల వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది. యూకే ప్రతీ యేట 5 బిలియన్ అరటి పండ్లను దిగుమతి చేసుకుంటుంది. వాటిల్లో 90 శాతం అమ్మకాలు ప్రధాన సూపర్ మార్కెట్ల ద్వారా జరుగుతున్నాయి. ప్రస్తుతం యూకేలోని కొన్ని షాపుల్లో అరటి పండ్ల జాడ లేకుండా పోయింది. గడిచిన వారం బ్రిటన్లోని సూపర్మార్కెట్లు అన్నీ అరటిపండ్ల కొరతను ఎదుర్కొన్నాయి. సప్లయ్ చెయిన్లో ఒడిదిడుకుల వల్లే అరటిపండ్ల ధరలు పెరుగుతున్నట్లు యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్కు చెందిన ప్రొఫెసర్ డాన్ బెబెర్ అంటున్నారు. అరటిపండ్ల పరిశ్రమకు వాతావరణ మార్పు దెబ్బ తగిలినట్లు వరల్డ్ బనానా ఫోరమ్ ఎకానమిస్ట్ లియూ తెలిపారు.
వేడెక్కుతున్న వాతావరణం వల్ల, తుఫాన్ల వల్ల సరఫరాలు నిలిచిపోయి, సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్లు భావిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు అరటి పండ్ల ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అధిక వేడి వల్ల పంటలు పూర్తిగా దెబ్బతింటున్నట్లు చెబుతున్నారు. అరటిపండు సరఫరాలు ఇలాంటి స్వల్పకాలిక వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగినప్పటికీ, వేడెక్కుతున్న వాతావరణంలో వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు నిపుణులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ మార్పులు అరటి రంగానికి అపారమైన ముప్పుగా భావిస్తున్నట్లు లియు అన్నారు.
వేడి వాతావరణం వల్ల వ్యాధులు వేగంగా విస్తరించడమే అతిపెద్ద సవాలుగా మారినట్లు తెలుస్తోంది. ఫుసేరియం విల్ట్ టీఆర్4 అనే ఫంగల్ వ్యాధి అరటి తోటల్లో ఎక్కువగా సోకుతున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియా నుంచి ఆ వ్యాధి ఏషియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దిశగా పయనిస్తుంది. అరటి తోటలకు ఒకసారి ఈ ఫంగస్ సోకితే అన్ని అరటి చెట్లను పూర్తిగా నాశనం చేస్తుంది. ఈ ఫంగస్ను తొలగించడం చాలా కష్టమని నిపుణులు అంటున్నారు. ఈ ఫంగస్ వరద ద్వారా, బలమై గాలుల ద్వారా వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. అధిక ఉష్ణోగ్రతలు ఈ వ్యాధిని వేగంగా వ్యాప్తి చెందిస్తాయి. ఎరువులు, ఇంధనం, రవాణా ఖర్చులు పెరగడంతో పాటు తగినంత మంది కూలీలు కూడా లభ్యంకాకపోవడంతో ఉత్పత్తిదారులు అరటి సాగులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటన్నింటి దృష్ట్యా రాబోయే రోజుల్లో అరటి ధరలు అకాశానికి ఎగబాకే అవకాశం ఉన్నట్లు అంచనా. రోమ్లో జరగనున్న సదస్సులో బనానా ఫోరమ్ కలుసుకోనుంది. ఈ సదస్సులో అరటి పండ్ల గురించి సమగ్ర స్థాయిలో చర్చించే అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.