పాకిస్తాన్ లో ఆలయంపై దాడి ఘటన.. 50 మంది అరెస్ట్.. 150 మందిపై కేసుల నమోదు

| Edited By: Phani CH

Aug 08, 2021 | 11:51 AM

పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో సిద్ధివినాయక ఆలయంపై దాడికి పాల్పడినవారిలో 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో 150 మందిపై కేసులు నమోదు చేశారు.

పాకిస్తాన్ లో ఆలయంపై దాడి ఘటన.. 50 మంది అరెస్ట్.. 150 మందిపై కేసుల నమోదు
50 Arrested In Pakistan
Follow us on

పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో సిద్ధివినాయక ఆలయంపై దాడికి పాల్పడినవారిలో 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో 150 మందిపై కేసులు నమోదు చేశారు. ఆలయంపై దాడి జరుగుతున్నా స్థానిక పోలీసులు మౌన ప్రేక్షక పాత్ర వహించడాన్ని పాక్ సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. దేవతా విగ్రహాలను ధ్వంసం చేయడం, నిప్పు పెట్టడం అత్యంత శోచనీయమని పంజాబ్ ప్రావిన్స్ సీఎం ఉస్మాన్ బుజ్డార్ ట్వీట్ చేశారు. భవిష్యత్తులో ఈ విధమైన ఘటనలు జరగకుండా చూస్తామని పేర్కొన్న ఆయన.. ఈ ఆలయ మరమ్మతు పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రావిన్స్ లోని రహీంయార్ ఖాన్ జిల్లా భోంగ్ సిటీలో గల ఈ టెంపుల్ పై ఓ గుంపు దాడి చేసి విగ్రహాలను ధ్వంసం చేసి పవిత్ర గ్రంథాలకు నిప్పు పెట్టింది. ఆలయంలో చాలా భాగాన్ని వారు నాశనం చేశారు. కాగా ఇలాంటి సంఘటనలు విదేశాల్లో పాక్ ప్రతిష్టను మంటగలుపుతాయని సుప్రీంకోర్టు పేర్కొంది. అటు-శుక్రవారం పాక్ పార్లమెంటు ఈ ఘటనను ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది.

ఈ ఆలయ సమీపంలో వందకు పైగా హిందూ కుటుంబాలు ఉన్నాయి. అనేకమంది ఒక్కసారిగా రాడ్లు, కర్రలు,, బండరాళ్లతో ఈ టెంపుల్ పై ఎటాక్ చేయడంతో ఈ కుటుంబాల వారంతా భయంతో హడలిపోయారు. భారత ప్రభుత్వం ఢిల్లీలోని పాక్ దౌత్యాధికారిని పిలిపించి తన నిరసనను తెలియజేసింది. గ్రేట్ బ్రిటన్ లో ప్రవాసం ఉన్న ముజాహిదా క్వామీ మూవ్ మెంట్ వ్యవస్థాపకుడు అల్తాఫ్ హుసేన్ ..ఈ ఘటనను ఖండిస్తూ ఇటీవల ఫైసలాబాద్ లోని ప్రార్థనా మందిరపై జరిగిన ఎటాక్ గురించి కూడా ప్రస్తావించారు. ఇలాంటివి విదేశాల్లో పాక్ ప్రతిష్టను దిగజారుస్తాయన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ఆఫ్గనిస్తాన్ పరిస్థితిపై చర్చకు అందని ఐరాస భద్రతా మండలి ఆహ్వానం.. పాకిస్తాన్ ఆగ్రహం

Wandering Elephants: ఎట్టకేలకు ఇంటికి చేరిన ఏనుగుల కథ.. 500 కి.మీ మేర ప్రయాణించి సరికొత్త రికార్డు..