
ముంబై బోరివలి రైల్వే స్టేషన్లో ఒక యువకుడు మహిళల బోగీలోకి ప్రవేశించి వేధింపులకు గురిచేశాడు. అంతేకాకుండా రన్నింగ్ ట్రైన్లో స్టంట్లు చేయడం సంచలనం సృష్టించింది. ఈ సంఘటన ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయింది. జీఆర్పీ పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 11, 2025 సాయంత్రం 6:40 గంటలకు బోరివలి స్టేషన్ నుంచి ఒక రైలు బయలుదేరింది. ఈ సమయంలో ఒక మహిళా ప్రయాణికురాలు విరార్ నుంచి అంధేరి వైపు దాదర్ ఫాస్ట్ లోకల్లో మహిళా బోగీలో ప్రయాణిస్తుంది. బోరివలి స్టేషన్ నుంచి రైలు బయలుదేరిన వెంటనే పక్కన ఉన్న లగేజ్ బోగీలో నిలబడి ఉన్న యువకుడు స్టంట్లు చేయడం ప్రారంభించాడు. ఈ సమయంలో అతడు మహిళా బోగీ వైపు చూస్తూ అసభ్యకరంగా మాట్లాడి మహిళలను వేధించాడు. ఈ సంఘటనను రైలులోనే ఉన్న మరో ప్రయాణికుడు మొబైల్లో రికార్డు చేసి, ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో అది వైరల్ అయింది.
ఇది చదవండి: దండిగా చేపలు పడదామని బోట్లో వెళ్లాడు.. నీటి అడుగున కనిపించింది చూడగా
వీడియో వైరల్ అవడంతో బీజేపీ మహిళా నేత చిత్రా వాఘ్ వెంటనే పోలీసులను చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీఆర్పీ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. సెప్టెంబర్ 29న బోరివలి ఆర్పీఎఫ్ సహకారంతో నిందితుడిని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడి పేరు నతూ గోవింద హంసా(35)గా గుర్తించారు. గుజరాత్ రాష్ట్రంలోని వలసాడ్కు చెందినవాడని వెల్లడైంది. విచారణలో అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు. కోర్టు అతడిని రిమాండ్కు పంపింది. బోరివలి జీఆర్పీ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ దత్త ఖుపెర్కర్ ఈ ఘటనపై స్పందిస్తూ మహిళా ప్రయాణికుల భద్రత తమకు ప్రథమ కర్తవ్యమని తెలిపారు. ఇలాంటి ఘటనలను ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.
ఇది చదవండి: అక్కడెలా పెట్టుకున్నావురా.. 10 ఏళ్ల బాలుడికి ఎక్స్రే తీసి బిత్తరపోయిన డాక్టర్లు