
సముద్రం అనగానే అనంతమైన జలరాశి, అందులోని ఉప్పునీరే మనకు గుర్తొస్తాయి. అయితే ఒకవేళ ప్రకృతి నియమాలు మారిపోయి, సముద్రంలోని ఉప్పునీరంతా రాత్రికి రాత్రే మంచి నీరుగా మారిపోతే ఏమవుతుంది? తాగడానికి ఫుల్ నీరు దొరుకుతుందని సంబరపడితే మనం తీవ్ర పొరపాటు పడినట్లే. ఎందుకంటే సముద్రం నీరు మంచిగా మారితే అది యావత్ భూగోళ వినాశనానికి దారితీస్తుందని సైన్స్ చెప్తుతుంది. సముద్రంలోని కోట్లాది జీవులు ఉప్పునీటి వాతావరణంలో జీవించడానికి అనుకూలంగా రూపాంతరం చెందాయి. వాటి శరీరాల్లో ఆస్మోసిస్ ప్రక్రియ నిరంతరం జరుగుతుంటుంది. సముద్రపు నీరు అకస్మాత్తుగా తీపిగా మారితే, చేపలు, తిమింగలాలు సహా ఇతర జలచరాల కణాల్లోకి నీరు వేగంగా చొచ్చుకుపోతుంది. ఫలితంగా వాటి శరీర కణాలు బెలూన్లలా ఉబ్బి పగిలిపోయి, ఆ జీవులన్నీ క్షణాల్లో మరణిస్తాయి. పగడపు దిబ్బలు పూర్తిగా కరిగిపోతాయి. సముద్ర జీవుల అంతంతో ఆహారపు గొలుసు తెగిపోయి భూమిపై ఉండే పక్షులు, జంతువులకు తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుంది.
సముద్రపు నీటిలోని ఉప్పు శాతం, ఉష్ణోగ్రతల వ్యత్యాసాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రవాహాలు కన్వేయర్ బెల్ట్ తరహాలో కదులుతూ భూమి ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంటాయి. నీటిలో ఉప్పు లేకపోతే ఈ ప్రపంచ ప్రవాహ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతుంది. ఫలితంగా భూమధ్యరేఖ సమీప దేశాలు తీవ్రమైన వేడిమికి దహించుకుపోగా, ఐరోపా, ఉత్తర అమెరికా వంటి ప్రాంతాలు శాశ్వతంగా గడ్డకట్టుకుపోతాయి.
మనం పీల్చే ప్రాణవాయువులో 50 నుండి 80 శాతం వరకు సముద్రాల్లోని ఫైటోప్లాంక్టన్, శైవలాల ద్వారానే ఉత్పత్తి అవుతుంది. తీపి నీటిలో ఇవి బతకలేక చనిపోతాయి. ఇవి కనుమరుగైతే భూమిపై ఆక్సిజన్ పరిమాణం సగానికి పైగా పడిపోయి మానవులు, జంతువులు తీవ్ర శ్వాసకోశ సమస్యలతో అల్లాడిపోవాల్సి వస్తుంది.
వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను గ్రహించే సముద్రాల సహజ సామర్థ్యం నాశనమవుతుంది. సాధారణంగా ఉప్పునీరు గడ్డకట్టడానికి మైనస్ 2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం కాగా మంచినీరు 0 డిగ్రీల వద్దే గడ్డకడుతుంది. దీనివల్ల ధ్రువ ప్రాంతాల్లో మంచు విపరీతంగా పెరిగిపోయి ప్రపంచవ్యాప్తంగా సరికొత్త హిమయుగం ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి మన దైనందిన జీవితంలో ఉపయోగించే ఉప్పు తయారీకే కాకుండా, భూమిపై సమస్త జీవకోటి మనుగడకు సముద్రపు ఉప్పునీరే అసలైన మూలాధారం.