
మహారాష్ట్రలోని ప్రసిద్ధ తాడోబా-అంధారీ టైగర్ రిజర్వ్లో ప్రకృతి ప్రేమికులను అబ్బురపరిచే దృశ్యం కెమెరాకు చిక్కింది. తాడోబా అభయారణ్యంలో ఎండ తీవ్రత, వేడి నుండి ఉపశమనం పొందేందుకు బిజిల్లీ అని పిలవబడే ప్రసిద్ధ ఆడపులి తన నాలుగు పిల్లలతో కలిసి అడవిలోని ఒక చిన్న నీటి కుంట వద్దకు వచ్చింది. సాధారణంగా పిల్లిజాతి జంతువులు నీటికి దూరంగా ఉంటాయని అనుకుంటారు.. కానీ, పులులు నీటిలో ఈత కొట్టడానికి, సేదతీరడానికి ఎంతగానో ఇష్టపడతాయి.
ఈ క్రమంలో బిజిల్లీ నీటిలో ప్రశాంతంగా కూర్చోగా, దాని పిల్లలు మాత్రం నీటిని చూసి ఉత్సాహంతో కేరింతలు కొట్టాయి. ఒకదానిపై ఒకటి నీటిని చల్లుకోవడం, నీటిలో ఈత కొడుతూ ఆడుకోవడం, తల్లి పులి చుట్టూ తిరుగుతూ సరదాగా గడపడం అక్కడ ఉన్న పర్యాటకులను ఎంతగానో అలరించింది.
అడవిలో జంగిల్ సఫారీకి వెళ్లిన పర్యాటకులు ఈ అరుదైన ఘట్టాన్ని తమ కెమెరాల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో నెట్లో ప్రత్యక్షమవ్వడమే ఆలస్యం, వేలాదిమంది నెటిజన్లు దీనిని చూసి మురిసిపోతున్నారు. పులుల ఫ్యామిలీ పూల్ పార్టీ చాలా క్యూట్గా ఉంది, ప్రకృతి అందాలు, వన్యప్రాణుల జీవన శైలికి ఇది అద్దం పడుతోంది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఉన్న తాడోబా-అంధారీ టైగర్ రిజర్వ్ భారతదేశంలో పులుల సంరక్షణకు అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ పులుల జనాభా ఎక్కువగా ఉండటంతో పాటు, పర్యాటకులకు పులులు తరచూ దర్శనమిస్తుంటాయి.
The best pool party that I have seen…
Under the watchful eyes of their protective mother 👩 https://t.co/f5SVNdlVM1— Susanta Nanda IFS (Retd) (@susantananda3) September 18, 2026
మనుషుల లాగే జంతువులు కూడా తమ కుటుంబంతో కలిసి ప్రశాంతంగా, సరదాగా సమయాన్ని గడుపుతాయనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం. ఈ వైరల్ వీడియో వన్యప్రాణి ప్రేమికులకు మరియు పర్యాటకులకు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..