
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనల మధ్య హృదయాన్ని హత్తుకునే ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఓ యువకుడు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బందికి పిజ్జా అందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సమయంలో ఈ మానవీయ ఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వైరల్ వీడియోలో ఓ యువకుడు పెద్ద పిజ్జా బాక్స్తో రోడ్డు పక్కన విధులు నిర్వహిస్తూ విశ్రాంతి తీసుకుంటున్న RAF సిబ్బంది వద్దకు వెళ్లాడు. అనంతరం ఒక్కొక్కరికి పిజ్జా ముక్కలు అందిస్తూ.. ప్లీజ్ తీసుకోండి సార్ అంటూ కోరాడు. మొదట కొందరు సిబ్బంది సంకోచించినప్పటికీ, తర్వాత కొంతమంది తీసుకున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో నితేష్ కుమార్ తివారీ అనే వ్యక్తి పంచుకున్నారు. వీడియోతో పాటు మేము యూనిఫామ్ను గౌరవిస్తాం. కానీ సాధారణ దుస్తుల్లో హింసకు పాల్పడేవారిని సమర్థించం. దయచేసి పోలీసులు, ప్రజలపై దాడులు చేయవద్దు అనే క్యాప్షన్ జోడించారు.
ఈ వీడియోపై వేలాది మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. విభేదాలు ఉన్నా మానవత్వం, పరస్పర గౌరవం కోల్పోవద్దనే సందేశాన్ని ఈ ఘటన అందించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉద్రిక్త పరిస్థితుల్లోనూ చిన్న మానవీయ చర్యలు సమాజంలో సానుకూల సందేశాన్ని వ్యాప్తి చేస్తాయని నెటిజన్లు పేర్కొంటున్నారు.