
“ముంబై… కలల నగరం” అనే మాట తరచూ వినిపిస్తుంటుంది. అయితే ఆ మాటకు నిజంగానే అర్థం ఉందా? అనే ప్రశ్నకు సమాధానంగా ఓ కంటెంట్ క్రియేటర్ పంచుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అర్ధరాత్రి ఒంటరిగా ముంబై వీధుల్లో తిరిగిన తన అనుభవాన్ని ఆమె వీడియో రూపంలో పంచుకోవడంతో నెటిజన్లలో చర్చ మొదలైంది.
అదితి ఠాకూర్ అనే ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ వీడియోను షేర్ చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ తన అనుభవాలను పంచుకునే అదితి, ఈసారి ముంబై గురించి ప్రత్యేకంగా వివరించారు. రాత్రి 12.30 గంటల సమయంలో మెరైన్ లైన్స్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఒంటరిగా సంచరించిన దృశ్యాలను వీడియోలో చూపించింది.
వీడియోలో వీధులు, వెలుగులతో కళకళలాడే ప్రాంతాలు, స్థానిక రైల్వే స్టేషన్, విధుల్లో ఉన్న పోలీసులు కనిపించారు. అర్ధరాత్రి అయినప్పటికీ తనకు ఎలాంటి భయం అనిపించలేదని, ముంబైలో మహిళలు రాత్రివేళల్లో కూడా స్వేచ్ఛగా ప్రయాణించడం కనిపిస్తుందని అదితి తెలిపింది. అందుకే ముంబైని “కలల నగరం” అని ఎందుకు పిలుస్తారని ఇప్పుడు తనకు అర్థమైందని పేర్కొంది.
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. చాలామంది ముంబై మహిళలకు సురక్షితమైన నగరాల్లో ఒకటిగా భావిస్తున్నట్లు కామెంట్లు చేశారు. మరికొందరు ముంబై పోలీసుల విధి నిర్వహణను ప్రశంసిస్తూ, నగర భద్రతను మెచ్చుకున్నారు. “ఇక్కడ పోలీసులు కనిపించకపోయినా భద్రత అనుభూతి కలుగుతుంది” అంటూ కొందరు అభిప్రాయపడ్డారు.
అయితే, ఒక నగరంలో వ్యక్తిగత అనుభవం ప్రతి ఒక్కరికీ ఒకేలా ఉండకపోవచ్చని కూడా కొందరు గుర్తుచేస్తున్నారు. మహిళల భద్రతపై అవగాహన, సమర్థవంతమైన పోలీసింగ్, ప్రజల సహకారం వంటి అంశాలపై చర్చకు ఈ వీడియో మరోసారి వేదికైంది. ప్రస్తుతం ఈ వీడియో లక్షలాది వ్యూస్ సాధిస్తూ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..