మనిషి అంతరించినా అవి బతుకుతాయ్.. అణుబాంబులు వేసిన చనిపోవ్.. వీటి పవర్ తెలిస్తే అవాక్కే..
ప్రపంచం అంతమైపోయినా.. మనుషులు తుడిచిపెట్టుకుపోయినా.. భూమిపై దర్జాగా బతికేస్తే ఒకే ఒక్క సూపర్హీరో మన ఇంట్లోనే తిరుగుతుంది. తల తెగిపోయిన వారాల తరబడి బతకడం, అణుబాంబు దాడిని తట్టుకుని సజీవంగా నిలబడడం ఈ కీటకానికి ఎలా సాధ్యమవుతుంది? డైనోసార్ల కాలం నాటి నుండి నేటివరకు, భూమిపై జరిగిన ఎన్నో మహా వినాశనాలను తట్టుకుని జెండా పాతిన ఆ జీవి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మానవజాతి తనను తాను భూమిపై అత్యంత తెలివైన, శక్తివంతమైన జీవిగా భావిస్తుంది. సైన్స్, టెక్నాలజీ, ఆధునిక నాగరికతలతో మనం గ్లోబల్ ఎకోసిస్టమ్లో టాప్ పొజిషన్లో ఉన్నాం. కానీ కేవలం బతుకు పోరాటం, తట్టుకునే శక్తి విషయానికి వస్తే మాత్రం.. మనకంటే ఒక చిన్న జీవి చాలా రెట్లు ముందుంది. అదే బొద్దింక. సైంటిఫిక్ కోణంలో చూస్తే.. ఈ భూమిపై మనుషులు ఇంకా కొత్తే, కానీ బొద్దింకలు కోట్ల సంవత్సరాలుగా ప్రతి మహా వినాశనాన్ని తట్టుకుని మరీ ఇక్కడ జీవిస్తున్నాయి.
రెండు ప్రపంచాలు.. కొన్ని పోలికలు..
మనుషులు వెన్నెముక ఉన్న క్షీరదాలు, బొద్దింకలు వెన్నెముక లేని కీటకాలు. అయినప్పటికీ బయలాజికల్గా ఈ వాటికీ కొన్ని ప్రాథమిక పోలికలు ఉన్నాయి. రెండు జీవులూ ఏదైనా తినగలవు.మొక్కల నుండి మాంసం వరకు దేన్నైనా జీర్ణించుకోగలవు. దానికీ శరీరాన్ని నియంత్రించే కేంద్ర నరాల వ్యవస్థ ఉంటుంది. పరిస్థితులకు అనుగుణంగా తమకు తాము మార్చుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అందుకే అంటార్కిటికా మంచు ఖండం నుండి మండే ఎడారుల వరకు ప్రపంచంలోని ప్రతి మూలలో ఇవి కనిపిస్తాయి.
తల తెగినా వారాల పాటు జీవించగలవు..
బొద్దింకను రియల్ సూపర్హీరోగా మార్చేది దాని శారీరక నిర్మాణమే. మనుషులకు లోపల అస్థిపంజరం ఉంటే, బొద్దింకలకు ఎక్సోస్కెలిటన్ ఉంటుంది. ఇది కైటిన్ అనే బలమైన పదార్థంతో తయారవుతుంది, ఇది వాటిని భారీ ఒత్తిడి, గాయాల నుండి కాపాడుతుంది. మనుషులు ఊపిరితిత్తులు, ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటారు. తల తెగితే రక్తం పోయి, ఆక్సిజన్ అందక వెంటనే చనిపోతారు. కానీ బొద్దింకల శరీరంలో స్పిరాకిల్స్ అనే చిన్న రంధ్రాలు ఉంటాయి. వాటి ద్వారానే అవి శ్వాస తీసుకుంటాయి. వాటి బ్లడ్ ప్రెజర్ చాలా తక్కువ కాబట్టి తల తెగినా రక్తం కారదు. తల లేకుండా కూడా అవి వారాల తరబడి జీవించగలవు. కేవలం ఆకలి, దాహం వల్ల మాత్రమే అవి చివరికి చనిపోతాయి.
డైనోసార్ల అంతాన్ని చూశాయి..
శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.. బొద్దింకలు దాదాపు 32 కోట్ల సంవత్సరాల నుండి ఈ భూమిపై ఉన్నాయి. అంటే అవి డైనోసార్ల రాకను, వాటి అంతాన్ని కూడా కళ్లారా చూశాయి. డైనోసార్లను తుడిచిపెట్టేసిన మహా వినాశనాన్ని కూడా ఇవి తట్టుకుని నిలబడ్డాయి. నేచర్ కమ్యూనికేషన్స్ రీసెర్చ్ ప్రకారం.. అమెరికన్ బొద్దింకల జీనోమ్ ఏ ఇతర కీటకాల కంటే చాలా పెద్దది. వాటి డిఎన్ఎలో విష పదార్థాలను ఎదుర్కొనే జీన్స్, రోగనిరోధక శక్తిని పెంచే జీన్స్, శరీర భాగాలను తిరిగి పునరుత్పత్తి చేసుకునే జీన్స్ కోడ్ అయి ఉంటాయి. అందుకే కెమికల్స్, పెస్టిసైడ్స్ వేసినా అవి త్వరగానే వాటికి అలవాటు పడి రెసిస్టెన్స్ పెంచుకుంటాయి.
అణు బాంబు పడిన తట్టుకోగలవు..
1945లో హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులు వేసినప్పుడు మనుషులు క్షణాల్లో బూడిదయ్యారు, కానీ అక్కడి శిథిలాల కింద బొద్దింకలు సజీవంగా కనిపించాయి. డిస్కవరీ ఛానల్ మిత్బస్టర్స్ ప్రయోగంలో ఒక షాకింగ్ విషయం తెలిసింది. సాధారణంగా మనుషులు కేవలం 5 నుండి 10 Gy (గ్రే) రేడియేషన్కే చనిపోతారు. కానీ బొద్దింకలు ఏకంగా 10,000 నుండి 100,000 Gy వరకు ప్రాణాంతక రేడియేషన్ను కూడా సులభంగా తట్టుకోగలవు. వాటి కణాల చాలా నెమ్మదిగా విభజన చెందుతాయి, అందుకే రేడియేషన్ వాటి డిఎన్ఎను అంత త్వరగా నాశనం చేయలేదు.
ఒకవేళ మనుషులు అంతరిస్తే..?
ఈ ప్రశ్నకు సైన్స్ చెప్పే సమాధానం.. ‘‘అవును, బొద్దింకలే భూమిని ఏలుతాయి. రేపు ఏదైనా అణు యుద్ధం జరిగినా, మహమ్మారి వచ్చినా లేదా వాతావరణ మార్పుల వల్ల మానవజాతి అంతరించిపోయినా బొద్దింకలు మాత్రం హాయిగా బతుకతాయి’’ అని అంటుంది. అవి ఆహారం లేకుండా ఒక నెల, నీరు లేకుండా రెండు వారాలు ఉండగలవు. చివరికి గ్లూ, పేపర్, తోలు, చనిపోయిన తమ తోటి బొద్దింకలను కూడా తిని పొట్ట నింపుకోగలవు. భూమిపై కొద్దిగా తేమ, జీవపదార్థం ఉన్నంత కాలం బొద్దింకల ఉనికి అంతం కాదు. మనుషులు నిర్మించిన కాంక్రీట్ భవనాలు, బంకర్లే వాటికి కొత్త సామ్రాజ్యాలుగా మారుతాయి.
