
ఒక ఇంట్లో కంప్యూటర్ టేబుల్పై అత్యంత విషపూరితమైన కామన్ క్రెయిట్ (కట్లపాము) స్వైరవిహారం చేస్తున్న దెబ్బకి దంపతులు హడలిపోయిన సంఘటన సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, దంపతులు తమ ఇంట్లో పని చేసుకుంటుండగా హఠాత్తుగా కంప్యూటర్ టేబుల్పై ఒక పాము కదలడం వారి కంటపడింది. మొదట టేబుల్పై, ఆ తర్వాత నేలపై కదులుతున్న ఆ పామును చూసి క్షణకాలం పాటు వారు ఎటూ తోచని స్థితికి చేరుకున్నారు. అయితే సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఆ కుటుంబ సభ్యుడు, కర్ర సహాయంతో ఆ విషసర్పాన్ని సురక్షితంగా ఇంటి నుంచి బయటకు పంపించగలిగాడు.
ఈ భయాందోళనకరమైన దృశ్యాలను వారు వీడియో తీసి ‘anusha_sadmal’ అనే ఇన్స్టాగ్రామ్ ఐడీ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కట్లపాముగా పిలిచే ఈ కామన్ క్రెయిట్ అత్యంత విషపూరితమైన పాములలో ఒకటి. నలుపు రంగు శరీరంపై సన్నటి తెల్లటి చారలతో ఉండే ఈ పాము కాటు వేస్తే తీవ్రమైన నాడీ వ్యవస్థ పక్షవాతం వచ్చి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఇవి రాత్రి వేళల్లో, నిశ్శబ్దంగా గోడలు, టేబుళ్లు ఎక్కగలవు కాబట్టి వీటిని సైలెంట్ కిల్లర్స్ అని పిలుస్తారు.
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సమయానికి ఆ పామును చూశారు. కాబట్టి పెద్ద ప్రమాదం తప్పి మీరు చాలా అదృష్టవంతులు అని కొందరు వ్యాఖ్యానించగా, పాములు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో నివసించేవారు తలుపులు, కిటికీలు ఎప్పుడూ మూసి ఉంచడం మంచిది అని మరికొందరు సలహాలు ఇస్తున్నారు. ఇళ్లలో చీకటి మూలలు, టేబుళ్ల కింద శుభ్రంగా ఉంచుకోవాలని, వర్షాకాలం, ఎండాకాలంలో ఇటువంటి విషపూరిత సరీసృపాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.