
సోషల్ మీడియాలో లైక్లు, వ్యూస్ కోసం యువత చేసే విన్యాసాలు వారి ప్రాణాలకే ఎసరు తెస్తున్నాయి. ప్రమాదకరమైన ప్రదేశాల్లో రీల్స్ చేస్తూ అమాయకంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఝార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఒక విషాద సంఘటన సోషల్ మీడియా పిచ్చి ఏ స్థాయికి చేరిందో తెలియజేస్తోంది. రైల్వే ట్రాక్పై నిలబడి వీడియో తీస్తున్న ఒక యువతిని వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఝార్ఖండ్లోని గఢ్వా జిల్లాకు చెందిన ధీరజ్సింగ్ కుమార్తె పూర్ణిమ కుమారి (19) అనే యువతి తన స్నేహితులతో కలిసి రీల్స్ చేయడానికి బయలుదేరింది. గఢ్వా పోలీస్స్టేషన్ పరిధిలోని జోబరీయా గ్రామం వద్ద ఉన్న రైల్వే ట్రాక్ సమీపానికి చేరుకుని, ఫోన్లో వీడియో షూటింగ్ ప్రారంభించారు. కెమెరా ముందు నటిస్తూ వీడియో తీయడంలో మునిగిపోయిన పూర్ణిమ, వెనుక వైపు నుంచి అత్యంత వేగంగా వస్తున్న రైలును గమనించలేకపోయింది. అప్పటికే ట్రాక్పై ఉన్న ఆమెను రాంచీ నుంచి చోపన్ వెళ్తున్న రైలు బలంగా ఢీకొట్టింది. ఈ అనుకోని ప్రమాదంతో అక్కడే ఉన్న స్నేహితులు షాక్కు గురయ్యారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్నేహితులు తీవ్రంగా గాయపడిన పూర్ణిమను గఢ్వా సదర్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన రక్తస్రావం కావడం వల్ల ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. బాధితురాలికి అత్యవసర మెరుగైన చికిత్స అవసరం కావడంతో, ఆమెను మరో పెద్ద ఆసుపత్రికి తరలించాల్సిందిగా సిఫార్సు చేసినట్లు గఢ్వా సివిల్ సర్జన్ జాన్ ఎఫ్. కెన్నెడీ తెలిపారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. రీల్స్, వీడియోల కోసం రైల్వే ట్రాక్లు, కొండచరియలు వంటి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు ప్రజలకు, ముఖ్యంగా యువతకు హెచ్చరిస్తున్నారు.