బిర్యానీ ట్రీట్ అంటూ పిలిచిన లెక్కల మాస్టర్.. కానీ, ఆ ట్రీట్ వెనుక అసలు కారణం ఇదే!
నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో లెక్కల టీచర్ శ్రీనివాస్ గారు విద్యార్థులకు బిర్యానీ ట్రీట్ ఇచ్చి, వారిలో గణితంపై ఆసక్తిని, మార్కులను పెంచారు. కఠినంగా కాకుండా ప్రోత్సాహంతోనే గొప్ప ఫలితాలు వస్తాయని నిరూపించారు. ఈ వినూత్న బోధనా పద్ధతి, ఉపాధ్యాయ-విద్యార్థి బంధం సోషల్ మీడియాలో వైరల్ అయ్యి, నెటిజన్ల ప్రశంసలు అందుకుంటుంది. కృషికి గుర్తింపుగా విద్యార్థులు ఈ సంఘటనను భావిస్తున్నారు.

నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. సాధారణంగా కఠినంగా ఉండే లెక్కట టీచర్ శ్రీనివాస్ గారు అకస్మాత్తుగా తన తరగతి విద్యార్థులను మధ్యాహ్నం తర్వాత క్లాస్రూమ్కు పిలిచారు. “అందరూ లంచ్ బాక్స్ తీసుకురావద్దు… నేను మీ అందరికీ బిర్యానీ ట్రీట్ ఇస్తాను,” అని ముందురోజే ప్రకటించడంతో విద్యార్థులు ఆనందంతో ఊగిపోయారు. చెప్పిన టైమ్కి అందరూ క్లాస్లో చేరగా, అక్కడ వారికి వేడివేడిగా ఉన్న బిర్యానీ ప్యాకెట్లు కనిపించాయి. దాంతో ఆ పిల్లలందరిలోనూ మరింత ఉత్సాహం పెరిగింది. బిర్యానీ అనుకుంటూ అందరూ తెగ సంబరపడ్డారు.
విద్యార్థులు బిర్యానీ తింటూ ఉండగానే, లెక్కల మాస్టరు వారికి ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. హఠాత్తుగా క్లాస్ రూమ్లోని ప్రొజెక్టర్ ఆన్ చేశారు. స్క్రీన్పై వారి యూనిట్ టెస్ట్ మార్కుల లిస్ట్ కనిపించడంతో పిల్లలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. మొదట భయపడిన విద్యార్థులకు తరువాత తెలిసింది ఏమిటంటే.. ఈ ట్రీట్కు ఒక ప్రత్యేక కారణం ఉందని గ్రహించారు.
ఇటీవల జరిగిన గణిత పరీక్షలో మొత్తం తరగతి సగటు మార్కులు గత సారి కంటే 20 శాతం పెరిగాయి. ముఖ్యంగా సాధారణంగా తక్కువ మార్కులు సాధించే ఐదుగురు విద్యార్థులు ఈసారి 80 శాతం పైగా మార్కులు సాధించారు. వారి కృషిని ప్రోత్సహించడానికి, అలాగే మిగతావారికి ప్రేరణగా నిలిపేందుకు ఈ సర్ప్రైజ్ ట్రీట్ ఏర్పాటు చేశానని లెక్కల టీచర్ శ్రీనివాస్ తెలిపారు. మార్కులు మాత్రమే కాదు, మీలో వచ్చిన మార్పు నాకు ముఖ్యము. మీరు ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలరు అంటూ ఆయన విద్యార్థులను ఎంతగానో ప్రశంసించారు.
ఈ ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్పందిస్తూ, టీచర్లు స్టూడెంట్స్ పట్ల కఠినంగా కాకుండా.. వారిని ప్రోత్సహించే విధానం ఇలాగే ఉండాలని చెప్పారు.. శిక్షల కంటే ప్రోత్సాహం గొప్ప ఫలితాలు ఇస్తుంది అని అన్నారు.
View this post on Instagram
ఇక, విద్యార్థులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, మాకు ఇది కేవలం బిర్యానీ ట్రీట్ కాదు, మా కష్టానికి గుర్తింపు అని తెలిపారు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. గురువు-విద్యార్థుల మధ్య సాన్నిహిత్యం, ప్రోత్సాహం ఎంత ముఖ్యమో మరోసారి ఈ ఘటన నిరూపించిందంటూ పెద్ద సంఖ్యలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది లెక్కల టీచర్ శ్రీనివాస్ పై పొగడ్తల వర్షం కురిపించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




