
సాధారణంగా మనం రెస్టారెంట్కు వెళ్తే ప్లేట్లలో వడ్డించే రకరకాల వంటకాలను తింటాం. కానీ కొలంబియాలోని ఒక ఫేమస్ రెస్టారెంట్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ భోజనం చివరలో ఇచ్చే డెజర్ట్ పద్ధతి చాలా వింతగా ఉంటుంది. కొలంబియాలోని బొగోటాలో ఉన్న ఎల్ సియెలో అనే హై-ప్రొఫైల్ రెస్టారెంట్లో ఈ వింత ఫీస్ట్ జరుగుతుంది. ఇక్కడ భోజనం ముగిసిన తర్వాత వెయిటర్లు వేడివేడి, కరిగించిన చాక్లెట్ను నేరుగా కస్టమర్ల చేతుల మీద పోస్తారు. ఆ చాక్లెట్ను కస్టమర్లు తమ చేతులకు రాసుకోవాలి. ఇది ఒక రకమైన సెన్సరీ ఎక్స్పీరియన్స్ అని.. దీనివల్ల చాక్లెట్ సువాసన మరియు స్పర్శ మనసును ప్రశాంతంగా ఉంచుతాయని హోటల్ యాజమాన్యం చెబుతోంది. చేతులకు రాసుకున్న ఆ చాక్లెట్ను కస్టమర్లు తమ వేళ్లతో నాకి తినేయాలి. చిన్న పిల్లలు చాక్లెట్ తిన్నప్పుడు పొందే ఆనందాన్ని తిరిగి గుర్తు చేయడమే ఈ చాక్లెట్ థెరపీ ఉద్దేశ్యమట.
ఈ రెస్టారెంట్లో ఒక పూట భోజనం ధర సుమారు 300 డాలర్లు ఉంటుంది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 25,000 నుండి రూ. 26,000 వరకు అన్నమాట. కేవలం ఈ ఒక్క చాక్లెట్ అనుభవం కోసమే కాదు, మొత్తం 20 రకాల వెరైటీ వంటకాలను ఒక కోర్సులా వడ్డిస్తారు. ఈ రెస్టారెంట్కు సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. సెలబ్రిటీలు మరియు టూరిస్టులు మాత్రం ఈ వింత అనుభూతిని పొందడానికి నెలల ముందే టేబుల్స్ బుక్ చేసుకుంటున్నారట.