
భారతీయ రైళ్లలో ఏసి కోచ్ ప్రయాణికులకు ఇచ్చే బెడ్ షీట్లు, టవల్స్, దుప్పట్లు భారీగా దొంగతనానికి గురవుతున్నట్లు ఒక ఆర్టిఐ (RTI) నివేదిక ద్వారా వెల్లడైంది. ఆర్టిఐ నివేదిక ప్రకారం, 2022 నుండి 2024 మే నెల వరకు ప్రయాణికులు లేదా దొంగలు రైళ్ల నుండి ఏకంగా 1.27 కోట్లకు పైగా వివిధ రకాల దుస్తులు, బెడ్ లినెన్ వస్తువులను దొంగిలించారు. ఇలా మాయమైన మొత్తం సామాగ్రి విలువ అక్షరాలా రూ. 104 కోట్లుగా అంచనా వేశారు.
ఫేస్ టవల్స్ (ముఖం తుడుచుకునే తువ్వాళ్లు): అత్యధికంగా దాదాపు 47 లక్షలు (4.7 మిలియన్లు).
బెడ్ షీట్లు : సుమారు 41 లక్షలు.
దిండ్ల కవర్లు: 26 లక్షలు.
దుప్పట్లు : 13 లక్షలు.
దిండ్లు : 3 లక్షలు.
ఇంత పెద్ద మొత్తంలో జరుగుతున్న నష్టాన్ని రైల్వే శాఖ భరించడం లేదు. ఈ బెడ్ లినెన్ వస్తువులను ఉతకడానికి, ప్రయాణికులకు సర్దడానికి రైల్వే శాఖ కాంట్రాక్టర్లను నియమిస్తుంది. వస్తువులు పోయినప్పుడు, ఆ నష్టాన్ని ఈ కాంట్రాక్టర్ల కింద అతి తక్కువ జీతానికి పనిచేసే పేద రైల్వే అటెండెంట్లు, హెల్పర్ల జీతాల నుండి మినహాయిస్తున్నారు. ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సామాజిక అంశం.
దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నప్పటికీ, రాజస్థాన్లోని బికనీర్, జార్ఖండ్లోని రాంచీ రైల్వే డివిజన్లు ఈ దొంగతనాల వల్ల అత్యధికంగా నష్టపోయాయి. దీనికి భిన్నంగా, దక్షిణ భారతదేశంలోని తమిళనాడుకు చెందిన తిరుచ్చి, కేరళకు చెందిన పాలక్కాడ్ రైల్వే డివిజన్లలో ఇలాంటి దొంగతనం సంఘటనలు ఒక్కటి కూడా నమోదు కాకపోవడం విశేషం. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే, కొందరి బాధ్యతారాహిత్యం వల్ల ప్రభుత్వ ఆస్తులు ఇలా దుర్వినియోగం కావడం విచారకరం.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..