
ప్రపంచంలో మనుషులు చూసి పారిపోయే ప్రమాదకరమైన జీవులు చాలా ఉన్నాయి. కానీ, అనుభవజ్ఞులైన వేటగాళ్లు సైతం ముట్టుకోవడానికి భయపడేంత విషపూరితమైన పక్షి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అవును, అలాంటి పక్షి ఒకటి నిజంగా ఉంది. దాని పేరు హుడెడ్ పిటోహుయ్. దీనిని ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పక్షిగా పరిగణిస్తారు. ఈ పక్షి ఈకలు, చర్మం,శరీరంలో ప్రాణాంతకమైన విషం ఉంటుంది
ఇండోనేషియా, పాపువా న్యూగినియాలోని దట్టమైన వర్షారణ్యాల్లో ఈ పక్షులు నివసిస్తాయి. 1990వ దశకంలో పరిశోధకుడు జాక్ డంబాచర్ పరిశోధనలు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఈ పక్షి ఈకలను, చర్మాన్ని తాకారు. వెంటనే ఆయన చేతులు మొద్దుబారడం, నాలుకపై మంట, వ్రమైన తిమ్మిరి రావడం గమనించి, దీనిపై శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించి ఇది విషపూరిత పక్షి అని నిర్ధారించారు.
హుడెడ్ పిటోహుయ్ పక్షి తన శరీరంలో సొంతంగా విషాన్ని ఉత్పత్తి చేసుకోదు. ఇది అడవిలో తినే మెలిరిడ్ బీటిల్స్ నే విషపూరితమైన పురుగుల ద్వారా ఈ విషాన్ని తన శరీరంలోకి గ్రహిస్తుంది. ఈ టాక్సిన్ దాని చర్మం మరియు ఈకల్లో పేరుకుపోతుంది.
ఈ పక్షిలోని బ్రాటకోటాక్సిన్ ఎంత శక్తివంతమైనదంటే, దక్షిణ అమెరికాలోని పాయిజన్ డార్ట్ కప్పల్లో లభించే విషం లాంటిదే ఇది. ఈ పక్షి ఇతర జీవులపై దాడి చేయడానికి విషాన్ని ఉపయోగించదు. కానీ, దీని ఒంటిపై ఉండే నలుపు, రింజ రంగులు శత్రువులకు నేను విషపూరితమైనదాన్ని అని హెచ్చరిక సంకేతాన్ని ఇస్తాయి. వేటగాళ్లు లేదా పెద్ద క్రూర పక్షులు దీనిని తినడానికి ప్రయత్నిస్తే తీవ్రమైన పారాలసిస్ లేదా శ్వాసకోశ నిరోధకత ఏర్పడుతుంది. అందుకే స్థానిక వేటగాళ్లు కూడా ఈ పక్షిని తాకడానికి సాహసించరు.