
పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వన్యప్రాణుల అక్రమ రవాణాకు సంబంధించిన ఒక భారీ కేసును కస్టమ్స్ శాఖ పట్టుకుంది. బుధవారం రాత్రి బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ పెద్ద మొత్తంలో విదేశీ తాబేళ్లను స్వాధీనం చేసుకుంది. సదరు ప్రయాణికుడు విమానాశ్రయం గ్రీన్ ఛానెల్ దాటడానికి యత్నిస్తుండగా అనుమానంతో తనిఖీ చేయగా, అతని వద్ద ఉన్న చెక్-ఇన్ బ్యాగేజ్లోని ప్లాస్టిక్ డబ్బాలలో వీటిని దాచినట్లు కనుగొన్నారు.
కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండిగో విమానం ద్వారా బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి ప్రవర్తనపై అధికారులకు అనుమానం వచ్చింది. అతను ఎలాంటి కస్టమ్స్ డిక్లరేషన్ లేకుండా నేరుగా గ్రీన్ ఛానెల్ దాటేందుకు యత్నిస్తుండగా కస్టమ్స్ సిబ్బంది అతనిని అడ్డుకుని తనిఖీలు చేశారు.
సదరు ప్రయాణికుడి చెక్-ఇన్ లగేజ్ను ఎక్స్-రే స్కాన్ చేయగా, లగేజ్ లోపల వింతైన ఆకారాలు కనిపించాయి. అనుమానంతో బ్యాగులను తెరిచి చూడగా అధికారులు ఆశ్చర్యపోయారు. బ్యాగ్లో ప్రత్యేకంగా అమర్చిన ప్లాస్టిక్ కంటైనర్లు, మెష్ బ్యాగ్లలో చిన్న చిన్న ప్రాణమున్న తాబేళ్లను అత్యంత కిక్కిరిసిన రీతిలో కుక్కి దాచారు. వీటన్నింటినీ లెక్కించగా మొత్తం 707 రెడ్-ఈర్డ్ స్లైడర్ జాతికి చెందిన తాబేళ్లు ఉన్నట్లు తేలింది.
ఈ రెడ్-ఈర్డ్ స్లైడర్ తాబేళ్లు ప్రధానంగా ఉత్తర అమెరికా ప్రాంతానికి చెందినవి. వీటి కళ్ళ వెనుక భాగంలో ఎరుపు రంగు మచ్చలు ఉండటం వల్ల వీటికి ఈ పేరు వచ్చింది. భారత్లో వీటిని ఇళ్లలో పెంచుకోవడానికి పెంపుడు జంతువులుగా విపరీతమైన డిమాండ్ ఉంది. బ్లాక్ మార్కెట్లో వీటిని అధిక ధరలకు విక్రయిస్తుంటారు.
On 22.07.2026, 707 invasive Red-eared Slider turtles (Trachemys scripta elegans) seized by Customs AIU, NSCBI Airport from a passenger’s checked-in baggage.
Seized under Customs Act, Wildlife Protection Act & CITES. Investigation ongoing.#WildlifeCrime @cbic_india @PIBKolkata pic.twitter.com/s3udBCvMIn
— Kolkata Customs (@kolkata_customs) July 22, 2026
కస్టమ్స్ యాక్ట్ 1962, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, అంతర్జాతీయ వన్యప్రాణి వ్యాపార నియంత్రణ ఒప్పందం నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను సదరు ప్రయాణికుడిని అధికారులు అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న 707 తాబేళ్లను సురక్షితంగా వెస్ట్ బెంగాల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు అప్పగించారు. ఈ అక్రమ రవాణా వెనుక అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాల హస్తం ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..