
ఇండియన్ రైల్వే.. ఎంతో మంది ప్రయాణికులు, ప్రజల్ని తమ గమ్యస్థానాలకు చేర్చిన అతి పెద్ద, సురక్షితమైన రవాణా మార్గం. రైలు ప్రయాణంలో మనకు అనేక రకాల మనుషులు తారసపడుతుంటారు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న ఫన్ని ఘటనలు, చూస్తున్న వారికి చిరాకు పుట్టించే సంఘటనలు కూడా జరుగుతుంటాయి. అలాంటిదే ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులో అప్పర్ బెర్త్పై కూర్చుని ఉన్న ఒక యువకుడు చేసిన చెత్త పని జనాలకు రోత పుట్టిస్తోంది. రెక్కల కష్టంతో బతికే చిరు వ్యాపారి పొట్టకొట్టిన ఓ యువకుడిపై జనాలు మండిపడుతున్నారు. ఇలాంటి వారిని అదుపులోకి తీసుకుని తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
వైరల్ వీడియో రద్దీ ఎక్కువగా ఉన్న ఒక రైలు కంపార్ట్మెంట్లో జరిగిన సంఘటనను చూపిస్తుంది. అసలే ఆ రైలు రద్దీతో కూడుకుని ఉంది. రైల్లో అప్పర్ బెర్త్పై కూర్చుని ఉన్న ఒక యువకుడు చేసిన పనిని కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వీడియో వైరల్గా మారింది. రైల్లో చిరు వ్యాపారి ఒకరు తన నెత్తిన ఒక బస్తా పెట్టుకుని రకరకాల స్నాక్స్ విక్రయిస్తున్నాడు. అందులో బిస్కెట్స్, చిప్స్, చిన్న జ్యూస్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ వంటివి అమ్ముతున్నాడు. అంతలోనే అప్పర్ బెర్త్పై ఉన్న ఆ యువకుడు చిరువ్యాపారితో మాట కలిపాడు. ఒక్క వస్తువైనా కొనకుండానే అతడి దృష్టి మరల్చే ప్రయత్నం చేశాడు. ఏది కొనకుండా మాటలు చెప్పటంతో ఆ వ్యాపారి అక్కడ్నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు..కానీ, రద్దీ కారణంగా ఆ వ్యాపారి నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఇదే అదునుగా పైబెర్తు పై ఉన్న యువకుడు మెల్లగా వ్యాపారికి అనుమానం రాకుండా అతడి నెత్తిన ఉన్న బ్యాగ్లోంచి ఓ జ్యూస్ ప్యాకెట్ చోరీ చేశాడు. ఈ విషయాన్ని వ్యాపారి గ్రహించక ముందుకెళ్లిపోయాడు.
వీడియో ఇక్కడ చూడండి..
సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. వీడియోలో యువకుడు మాత్రం తానేదో ఘన కార్యం చేసినట్టు చోరీ చేసిన జ్యూస్ ప్యాకెట్ చూసుకుని తెగ మురిసిపోయాడు. అలా తన బెర్తు పక్క నుంచి వెళ్లిన ప్రతి వ్యాపారి వద్ద నుంచి ఆ యువకుడు ఇదే తరహా చోరీ చేశాడు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. యువకుడు చేసిన పనిపై విరుచుకుపడుతున్నారు.పేద వ్యాపారిని మోసం చేస్తున్న ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..