9/11 దాడి జరిగి 25 ఏళ్లు..2,977 డ్రోన్ల లైట్ షోతో నివాళి

సెప్టెంబర్ 11, 2001లో న్యూయార్క్‌లోని ట్విన్‌ టవర్స్‌పై అల్ ఖైదా ఉగ్రవాదులు దాడి చేసి కూల్చివేశారు. 3 వేల మంది మరణించిన ఆ విషాద ఘటనకు 25 ఏళ్లు పూర్తయింది. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా న్యూయార్క్ హార్బర్‌పై సరిగ్గా 2,977 డ్రోన్‌లను ఆకాశంలో ప్రదర్శించారు. ఆ డ్రోన్‌లన్నీ కలిసి ట్విన్‌ టవర్స్ ఆకారంలో ఏర్పడి కాంతులు వెదజల్లాయి. ఆనాడు ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్క బాధితుడి జ్ఞాపకార్థం ఒక డ్రోన్‌ను కేటాయించి ఘన నివాళి అర్పించారు.

9/11 దాడి జరిగి 25 ఏళ్లు..2,977 డ్రోన్ల లైట్ షోతో నివాళి
Drones Light Up New York To Recreate Twin Towers Anniversary

Updated on: Sep 11, 2026 | 3:47 PM

న్యూయార్క్ హార్బర్‌లో జరిగిన ఈ ప్రత్యేక డ్రోన్ ప్రదర్శన అక్కడి ప్రజలను ఎంతగానో కదిలించింది. రాత్రి సమయంలో ఆకాశంలో మెరిసిన ఆ డ్రోన్లు సరిగ్గా ట్విన్‌ టవర్స్‌ ఆకారాన్ని సంతరించుకోవడంతో, స్థానిక ప్రజలు,  మన్‌హాటన్‌ వాసులు పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ అద్భుతమైన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఫ్లైట్ 93 ప్రయాణికుడి సాహస గాథ

సెప్టెంబర్‌ 11, 2001లో అమెరికాలో విధ్వంసం సృష్టించిన ఉగ్రవాద దాడులు జరిగి నేటికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఒసామా బిన్‌ లాడెన్‌ నాయకత్వంలోని అల్‌ఖైదా తీవ్రవాదులు సరిగ్గా ఇదే రోజు నాలుగు విమానాలను హైజాక్ చేసి దారుణానికి ఒడిగట్టారు. మూడు విమానాలతో ట్విన్ టవర్స్, పెంటగాన్ భవనాలను ఢీకొట్టగా.. నాలుగవదైన ‘ఫ్లైట్‌ 93’ మాత్రం గమ్యస్థానాన్ని చేరలేక మధ్యలోనే నేలకూలింది. వాషింగ్టన్‌లోని కాపిటల్ భవనం లేదా వైట్ హౌస్ పై  ఆ విమానంతో దాడి చేయాలని ఉగ్రవాదులు భావించారు. అయితే టాడ్ బీమర్‌తో పాటు ఇతర ప్రయాణికులు చూపిన ధైర్యసాహసాలు ఆ భారీ విధ్వంసాన్ని అడ్డుకున్నాయి. విమానం హైజాక్ అయిందని తెలుసుకున్న ప్రయాణికులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉగ్రవాదులపైకి ఎదురుతిరిగారు. వారి పోరాటం తర్వాత  విమానం కంట్రోల్ తప్పి పెన్సిల్వేనియాలో కూలిపోయింది.  ఆ రోజు ఆ ప్రయాణికులు చేసిన ఆత్మత్యాగం వల్ల వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా నిలిచాయి.

సెప్టెంబర్ 11, 2001 దాడులకు సంబంధించి యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 93 లో హైజాకర్లపై ప్రయాణికులు తిరగబడిన ఘటన చరిత్రలో నిలిచిపోయింది.

కుట్రను పసిగట్టిన ప్రయాణికులు


 ఫోన్ కాల్స్ ద్వారా నూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఇతర విమానాలతో దాడులు జరిగిన విషయాన్ని ప్రయాణికులు తెలుసుకున్నారు. తమ విమానాన్ని కూడా ఒక ఆయుధంగా ఉపయోగించబోతున్నారని తెలుసుకుని  ప్రాణాలను పణంగా పెట్టి తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకున్నారు.

Todd Beamer

టాడ్ బీమర్ సాహసం

32 ఏళ్ల ప్రయాణికుడు టోడ్ బీమర్ తోటి ప్రయాణికులను ఏకం చేసి, పదండి ముందుకు వెళ్దాం అంటూ ఉగ్రవాదులపైకి దూసుకెళ్లడానికి నాయకత్వం వహించారు. ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి చొరబడి హైజాకర్లతో పోరాడటంతో విమానంపై ఉగ్రవాదులు నియంత్రణ కోల్పోయారు. చివరికి ఆ విమానం పెన్సిల్వేనియాలోని ఒక ఖాళీ ప్రదేశంలో కూలిపోయింది. ఉగ్రవాదుల లక్ష్యం నెరవేరకుండా అడ్డుకోవడంలో ఆ ప్రయాణికులు చేసిన సాహసం వల్ల వాషింగ్టన్‌లో జరగాల్సిన భారీ ప్రాణనష్టం తప్పింది. వారి త్యాగం అమెరికా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

Loading...
Unable to load recommendations.
Follow Us