
విదేశాలకు వెళ్లి ఆహ్లాదకరంగా గడపాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే అధిక ఖర్చులు, వీసా సమస్యల భయంతో చాలామంది తమ ఫారిన్ టూర్ ప్లాన్స్ను వాయిదా వేసుకుంటుంటారు. కానీ ఎక్కువ ఖర్చు లేకుండా, భారత్కు అతి సమీపంలో ఉండే ఒక అద్భుతమైన దేశాన్ని తక్కువ బడ్జెట్లోనే చుట్టిరావచ్చు. భారత్ నుంచి కేవలం మూడు గంటల విమాన ప్రయాణంతో చేరుకోగల ఆ దేశం గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. చారిత్రక వాస్తుశిల్పం, గొప్ప సంస్కృతికి నిలయమైన ఉజ్బెకిస్తాన్ భారతీయ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడి కరెన్సీ విలువ భారత రూపాయితో పోలిస్తే చాలా తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. మన దేశానికి చెందిన ఒక రూపాయి విలువ అక్కడ సుమారు 132 ఉజ్బెకిస్తానీ సోమ్లకు సమానం. అంటే మన రూ.100 విలువ అక్కడ ఏకంగా 13,200 సోమ్లుగా మారుతుంది. దీనివల్ల లగ్జరీ హోటళ్లలో బస, ఇతర ప్రయాణ ఖర్చులు చాలా తక్కువ ధరలకే పూర్తవుతాయి.
భారతదేశం నుంచి ఉజ్బెకిస్తాన్ వెళ్లడం చాలా సులభం. ఢిల్లీ, ముంబై నగరాల నుంచి ఉజ్బెకిస్తాన్కు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కేవలం 3 గంటల్లోనే అక్కడికి చేరుకోవచ్చు. వీసా కోసం రాయబార కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా, భారతీయులకు సులభమైన ఈ-వీసా సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
ఉజ్బెకిస్తాన్ సంప్రదాయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఇక్కడి పులావ్ చాలా ఫేమస్. వీటితో పాటు రకరకాల నాన్లు, రొట్టెలు, రుచికరమైన మాంసాహార వంటకాలు లభిస్తాయి. భారత్తో ఉన్న సుదీర్ఘ సాంస్కృతిక సంబంధాల కారణంగా శాకాహార ప్రియులకు కూడా తగిన ఆహార ఎంపికలు ఇక్కడ సులభంగా దొరుకుతాయి.
సమర్ఖండ్, బుఖారా వంటి నీలిరంగు గోపురాలతో కూడిన చారిత్రక నగరాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. అంతర్జాతీయ స్థాయి విలాసవంతమైన పర్యాటక అనుభవాన్ని, అత్యంత తక్కువ బడ్జెట్లో ఆస్వాదించాలనుకునే భారతీయ యాత్రికులకు ఉజ్బెకిస్తాన్ ఒక సరైన గమ్యస్థానం అని చెప్పవచ్చు.