
భారత్లో పోకచెట్ల సాగులో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. దేశంలో జరిగే మొత్తం ఉత్పత్తిలో సింహభాగం ఇక్కడి నుంచే వస్తుంది. సరైన నీటి పారుదల, యాజమాన్య పద్ధతులు పాటిస్తే, ఎకరాకు లక్షల్లో ఆదాయం పొందే అవకాశం ఉన్నందున రైతులు దీనిని లాభదాయకమైన వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు. భారత్లో పోకచెట్ల సాగు ఎక్కువగా దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలలో విస్తరించి ఉంది.
కర్ణాటక: దేశంలోనే అత్యధికంగా సుపారీ ఉత్పత్తి చేసే రాష్ట్రం కర్ణాటక. ఇక్కడ దాదాపు 6.76 లక్షల హెక్టార్లలో ఈ సాగు జరుగుతుండగా, సుమారు 10 లక్షల టన్నుల ఉత్పత్తి నమోదు అవుతోంది. ఉత్తర కన్నడ, శివమొగ్గ, ఉడుపి, దక్షిణ కన్నడ, చిత్రదుర్గ జిల్లాలలో ఇది ప్రధాన వాణిజ్య పంట.
కర్ణాటక తర్వాత కేరళ, అస్సాం రాష్ట్రాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక్కడి వాతావరణం, సమృద్ధిగా కురిసే వర్షపాతం పోక తోటల పెరుగుదలకు ఎంతో అనుకూలం. మేఘాలయ, మిజోరం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, త్రిపురలలో కూడా కొంత విస్తీర్ణంలో దీనిని సాగు చేస్తున్నారు.
ఇకపోతే, పోకచెట్టు నాటిన 4 నుండి 8 సంవత్సరాల మధ్య కాపుకు వస్తుంది. ఒకసారి తోట స్థిరపడితే సుమారు 50 నుండి 60 సంవత్సరాల వరకు క్రమం తప్పకుండా దిగుబడిని ఇస్తుంది. పోక తోటల పెంపకం రైతులకు మంచి ఆర్థిక పురోగతిని అందిస్తుంది. మొదటి 6-7 సంవత్సరాల పాటు మొక్కల పెంపకం, నీటి వసతి, ఎరువుల నిర్వహణకు కొంత ఖర్చు అవుతుంది. ఇక చెట్లు కాపుకొచ్చిన తర్వాత ఎకరాకు సగటున 8 నుండి 12 క్వింటాళ్ల ఎండిన పోకచెక్కల దిగుబడి వస్తుంది. మార్కెట్ ధరల ఆధారంగా ఎకరాకు సంవత్సరానికి నికరంగా రూ.2.5 లక్షల నుండి రూ.4 లక్షల వరకు నికర లాభం పొందే అవకాశం ఉంటుంది.
పోక తోటలలో మిరియాలు, యాలకులు, అరటి, కోకో వంటి పంటలను అంతర పంటలుగా సాగు చేయడం ద్వారా రైతులు అదనపు రాబడిని సాధిస్తున్నారు. సరైన నీటి యాజమాన్యం, దిగుబడిని పెంచే ఆధునిక పద్ధతులు పాటిస్తే పోక సాగు అనేది దీర్ఘకాలికంగా స్థిరమైన, అధిక రాబడినిచ్చే వ్యవసాయ వ్యాపారంగా మారుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..