Telangana: మందు సిట్టింగ్ వేసిన ముగ్గురు స్నేహితులు.. మత్తులో ఫోన్ లాక్కోగా.. ఆ తర్వాత

ఆ ముగ్గురు మిత్రులు ఓ ఖాళీ ప్లేస్ చూసుకుని తాగడం మొదలు పెట్టారు. ఈలోగా సెల్ ఫోన్ విషయంలో చిన్న గొడవ జరిగింది.. ఆపై జరగకూడనిది జరిగిపోయింది. చివరికి ఎవరికీ తెలియకుండా ఇద్దరు పరారయ్యారు. ఈ ఘటన మంచిర్యాలలో చోటు చేసుకోగా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana: మందు సిట్టింగ్ వేసిన ముగ్గురు స్నేహితులు.. మత్తులో ఫోన్ లాక్కోగా.. ఆ తర్వాత
Telangana

Edited By:

Updated on: Mar 24, 2026 | 4:08 PM

మద్యం మత్తులో అన్నంత పని చేశారు. తోటి కూలీని దారుణంగా కొట్టి చంపేశారు. సెల్‌ఫోన్ విషయంలో ముగ్గురు కూలీల మద్యన తలెత్తిన గొడవ హత్యకు దారి తీసింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల సీఐ ప్రమోద్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన దీపక్(35), భీమిని సంజీవ్, కాసిపేట మండలం సిడం దీపక్‌లు జిల్లా కేంద్రంలోని చిందం శ్రీనివాస్ అనే బిల్డర్ వద్ద కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఈ నెల 19న జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో దీపక్, సంజీవ్, సిడం దీపక్‌లు రాత్రి మద్యం తాగుతుండగా సెల్ ఫోన్ విషయంలో గొడవ పడ్డారు. ఈ క్రమంలో సంజీవ్, సిడం దీపక్‌లు దీపక్‌పై దాడి చేశారు. విచక్షణారహితంగా చితకబాదారు. దీపక్ తలపై రాడుతో బలంగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే మత్తులో నుంచి తేరుకున్న సంజీవ్, సిడం దీపక్‌లు తీవ్రగాయాల పాలైన దీపక్‌ను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి పరారయ్యారు.

వైద్యులు చికిత్స అందించినా దీపక్ ప్రాణాలు నిలవలేదు. దీపక్ చికిత్స పొందుతూ చనిపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టి నిందితులు సిడాం దీపక్, సంజీవ్ ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. కోర్టు నిందితులకు 14 రోజుల రిమాండ్‌ను విధించడంతో లక్షేట్టిపేట సబ్ జైలు‌కు తరలించినట్లు సీఐ ప్రమోద్ రావు వెల్లడించారు.

ఇది చదవండి: రెండేళ్లు కెరీర్‌లో చాలా కోల్పోయా.. ఆ ఇద్దరి వల్లే నేను ఇవాళ ఇక్కడ ఉన్నా..

Follow Us