
లోన్ యాప్లో అప్పు తీసుకున్న యువకుడికి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన హనుమకొండలో జరిగింది. తన ఆత్మహత్యకు కారణాలను వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్న ఆ యువకుడు నగర శివారులోని పాత బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. డెడ్ బాడీని బయటకు తీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి పంపించారు. ఈ విషాద సంఘటన హనుమకొండలోని టీవీ టవర్ కాలనీలో జరిగింది. నవీన్ అనే యువకుడు ఉన్నత చదువులు చదువుకున్నాడు. తన వ్యక్తిగత అవసరం కోసం లోన్ యాప్ ద్వారా కొంత రుణం తీసుకున్నాడు. ఆ అప్పు తీర్చడానికి స్నేహితుల వద్ద చే బదులు తీసుకున్నాడు.
చైనాకు యాప్ ద్వారా లోన్ తీసుకొని చెల్లించకపోవడంతో, అతడి ఫొటోలను మార్ఫింగ్ చేసి వాట్సప్ లో పోస్ట్ చేశారు. వేధింపులు ఎక్కువయ్యాయి. ఇంటా బయటా ఎవరిని డబ్బులు అడిగే పరిస్థితి లేదు. దీంతో మనస్తాపానికి గురైన నవీన్, వేధింపులు తట్టుకోలేక వడ్డేపల్లి – దేవన్నపేట మధ్యలోని బావిలో దూకి బలవన్మరణం చెందాడు.. సెల్ నెట్వర్క్ లొకేషన్ ఆధారంగా మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.