
ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన కోరాడ సింహాచలం(25)కు, అదే జిల్లాలోని అంకవరం గ్రామానికి చెందిన భవాని(19)తో రెండు నెలల క్రితం వివాహమైంది. సింహాచలం హైదరాబాద్ లో కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. జగద్గిరిగుట్ట గాంధీనగర్ లో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు దంపతులు మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ రైలులో సికింద్రాబాద్ నుంచి గురువారం రాత్రి బయలుదేరారు.
రైలు వంగపల్లి రైల్వేస్టేషన్ దాటిన తర్వాత డోర్ వద్ద నిలబడి ఉన్న ఇద్దరూ జారిపడి మృతిచెందారు. శుక్రవారం ఉదయం విధుల్లో ఉన్న ట్రాక్ మెన్ గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. రెండు మృతదేహాలను భువనగిరి ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించి ఏపీలోని పార్వతీపురం మాన్యం జిల్లాకు పంపించారు.
ఈ నవ దంపతులు ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందారని అందరూ భావించారు. కానీ వారి మృతి పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నవ దంపతులు ప్రమాదవశాత్తు జారిపడ్డారా..లేక ఆత్మహత్య చేసుకున్నారా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఘటనకు ముందు నవ దంపతులు రైలులో ఘర్షణ పడుతున్న వీడియోలు వెలుగు చూశాయి. ఆ క్రమంలో గేటు వద్దకు నవ దంపతులు చేరుకున్నారు. దాంతో భర్తతో గొడవపడిన భవాని కావాలనే రైలు నుంచి దూకేసిందా..? ఆమెను కాపాడే ప్రయత్నంలో భర్త సింహాచలం కూడా దూకేశాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇద్దరూ కావాలనే రైలు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణంలో కూడా పోలీసులైతే దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..