కుటుంబ సమస్య పరిష్కారం కోసం వచ్చిన మహిళపై దారుణం..
Hyderabad Crime News: కుటుంబ సమస్య పరిష్కారం కోసం సికింద్రాబాద్కు వచ్చిన 43 ఏళ్ల మహిళను టీవీ కార్యక్రమ నిర్వాహకులను కలిపిస్తామని నమ్మించి ఇద్దరు వ్యక్తులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మహంకాళి పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కుటుంబ కలహాలకు పరిష్కారం దొరుకుతుందనే ఆశతో నగరానికి వచ్చిన ఓ మహిళ దారుణానికి గురైంది. తనకు సహాయం చేస్తామని నమ్మించిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన సికింద్రాబాద్లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 43 ఏళ్ల మహిళకు వివాహమై ఓ కుమారుడు ఉన్నాడు. భర్త నుంచి వరకట్న వేధింపులు ఎదురవడంతో కొంతకాలంగా అతనికి దూరంగా ఉంటోంది. తన సమస్యను ఓ ప్రముఖ టీవీ ఛానెల్ నిర్వహించే సామాజిక కార్యక్రమం ద్వారా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఆమె సికింద్రాబాద్కు వచ్చింది. రైల్వే స్టేషన్లో ఉన్న సమయంలో ఓ వ్యక్తి ఆమెతో మాట్లాడి, కార్యక్రమ నిర్వాహకులు తనకు సన్నిహితులని, వారిని కలిపిస్తానని చెప్పాడు. అతడి మాటలను నమ్మిన మహిళ అతడితో వెళ్లేందుకు అంగీకరించింది.
బైక్పై తీసుకెళ్లిన అతడు రాణిగంజ్లోని హైదర్ కాంప్లెక్స్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి చేరుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన మరో వ్యక్తి కూడా అదే దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో వెల్లడైంది. బాధితురాలు ప్రతిఘటిస్తూ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వస్తారనే భయంతో ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు.
అనంతరం బాధితురాలు నేరుగా మహంకాళి పోలీస్ స్టేషన్కు చేరుకుని జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సేకరించిన ఆధారాలు, బాధితురాలు తెలిపిన వివరాల ఆధారంగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
