
టమాట షాక్.. పచ్చి మిర్చి మంటలు రగులుతున్నాయి.. వీటిని ఆసరాగా చేసుకుని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వినూత్న నిరసనలు చేపడుతున్నారు. హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన టమాట నిరసన జనంలో చర్చగా మారింది.
హనుమకొండలోని తిరుమల జంక్షన్లో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు కాంగ్రెస్ నేతలు. టమాట, పచ్చి మిర్చి ధరలు రూ. 140 చేరిన నేపథ్యంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పనిలో పనిగా వినియోగదారులకు టమాటా, పచ్చి మిర్చి ఉచితంగా పంపిణీ చేశారు.
టమాట ధరలు సామాన్య ప్రజలకు దడ పుట్టిస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని ఆరోపించారు. పాలకుల వైఫల్యం వల్లే నిత్యవసర వస్తువుల ధరలు అమాంతం పెరిగాయని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరచి సబ్సిడీ పై టమాట, పచ్చి మిర్చి ప్రజలకు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాల్లో సబ్సిడీపై టమాటాలు అందిస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
కూరగాయల ధరలు అమాంతం పెరగడంతో, అందులోనూ టమాట రేటు భారీగా ఉండటంతో దానిని చూస్తేనే వనికిపోతున్నారు జనం. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉచిత టమాటాల పంపిణీ కార్యక్రమం చూసి జనాలు భారీగా ఎగబడ్డారు. మొత్తం మీద రాజకీయ పార్టీల టమాట మంటలు బర్నింగ్ టాపిక్ మారాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..