Telangana: 40 ఏళ్లుగా ఆ గ్రామంలో ఒకే ఒక్క వినాయకుడి విగ్రహం.. ఎక్కడా..? ఎందుకంటే..?

| Edited By: Balaraju Goud

Sep 08, 2024 | 12:51 PM

వినాయక చవితి వచ్చిందంటే గల్లిగల్లీకి విగ్రహం పెట్టి, డీజే చప్పుళ్లతో హంగామా చేయడం చూస్తుంటాం. ముఖ్యంగా ఎన్నికల వేళ ఎక్కడా చూసిన గణపతి విగ్రహాలే కనిపిస్తుంటాయి.

Telangana: 40 ఏళ్లుగా ఆ గ్రామంలో ఒకే ఒక్క వినాయకుడి విగ్రహం.. ఎక్కడా..? ఎందుకంటే..?
Nalgonda Ganesh
Follow us on

వినాయక చవితి వచ్చిందంటే గల్లిగల్లీకి విగ్రహం పెట్టి, డీజే చప్పుళ్లతో హంగామా చేయడం చూస్తుంటాం. ముఖ్యంగా ఎన్నికల వేళ ఎక్కడా చూసిన గణపతి విగ్రహాలే కనిపిస్తుంటాయి. ప్రతి గ్రామంలో కనీసం పది విగ్రహాలైన ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ ఈ గ్రామస్తులు మాత్రం కుల, మతాలకు అతీతంగా జాతీయోద్యమ స్ఫూర్తితో ఒకే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ ఆనవాయితీని గత 40 ఏళ్లుకు పైగా కొనసాగిస్తున్నారు. ఆ గ్రామం.. ఎక్కడ ..? వివరాల్లోకి వెళ్తే..

ఓ బొజ్జ గణపయ్య.. నీ బంటు నేనయ్య.. ఉండ్రాళ్ళ మీదికి దండు పంపవయ్యా.. కమ్మని నేయితో కడు ముద్దపప్పును. అంటూ ఊరు.. వాడ నవరాత్రుల్లో తెగ బిజీగా ఉన్నారు. వారు వీరు అంటూ లేదు.. చిన్న పెద్ద అంతా ఆ గణేషుడి పూజలో మునిగిపోతున్నారు. అయితే ఆ గ్రామంలో మాత్రం వాడ వాడన కాకుండా అంతా ఒక్కటిగా ఏకదంతుడికి చవితి పూజలు చేస్తున్నారు. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం కేశవాపురంలో గ్రామస్తులు ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటారు. గ్రామంలో కొన్నేళ్లుగా రామాలయం వద్ద గణపతి విగ్రహాన్ని పెట్టి నవరాత్రులు పూజలు చేస్తారు. ఈ పూజల్లో అన్ని కులాలకు చెందిన భక్తులు పాల్గొంటారు. ఈ గ్రామం గతంలో కన్నెకల్‌ గ్రామ పరిధిలోని ఆవాస గ్రామంగా ఉండేది. ఐదేళ్ల క్రితం ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటయింది. అయినా గత అయిదేళ్లుగా ఎప్పటిలాగానే జాతీయోద్యమ స్ఫూర్తితో ఒకే విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఐక్యతను చాటుకుంటున్నారు.

అన్ని గ్రామాల్లో మాదిరిగా ఈ గ్రామంలో గల్లి, గల్లికో వినాయక విగ్రహలను ఏర్పాటు చేయలేదు. రాజకీయ నేతలు, రానున్న ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులు పోటీ పడి విగ్రహాలు, విరాళాలతో ఇస్తామంటూ ముందుకు వచ్చారు. అయినా నేతల దాతృత్వాన్ని ఈ గ్రామస్తులు సున్నితంగా తిరస్కరించారు. వినాయక చవితికి ముందే గ్రామస్తులు నిర్వహణ కమిటీ ఏర్పాటు చేసుకుంటారు. ఆ కమిటీ తీర్మానం ప్రకారమే భక్తులు, గ్రామస్తులు నడుచుకోవటం ఆనవాయితీ. ఇతర గణేష్ మండపాల వద్ద మాదిరిగా డీజే చప్పుళ్లు, డాన్స్ ప్రోగ్రామ్ లు ఇక్కడ ఉండవు.

కేవలం భజనలు, కోలాటాలు ఆడడం ఇక్కడి ప్రత్యేకత. గ్రామస్తులంతా కలిసి ఒకే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్ల డబ్బులు వృథా కాకుండా పర్యావరణం కాలుష్యాన్ని కూడా అరికట్టవచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో ఎన్ని విగ్రహాలు పెడితే ప్రజల మధ్య దూరం అంత పెరుగుతుందని ఇక్కడ గ్రామస్తులు భావిస్తున్నారు. జాతీయ ఉద్యమ స్ఫూర్తితో గత 40 ఏళ్లుగా గ్రామంలో ఒకే ఒక గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు.

అప్పట్లో చిన్న గ్రామంగా ఉన్న కేశవాపురం.. ఇపుడు ప్రత్యేక గ్రామపంచాయతీ ఏర్పడినా.. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ.. ఆనందంగా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకుంటున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. ఉత్సవాలను కులమతాలకు అతీతంగా అందరం కలిసి మెలిసి జరుపు కుంటున్నామని గ్రామ పూజారి దుర్గి శ్రీనివాస శర్మ, చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..