Telangana: తెలంగాణ రాజకీయాల్లో స్పష్టమైన మార్పులు.. అసలేం జరుగుతోంది.?

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు వస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్త సమీకరణాలకు పార్టీలు తెర లేపుతున్నాయి. పాత మిత్రులు కొత్తగా పొత్తు పెట్టుకుంటారా..? కర్నాటక ఫలితాల తర్వాత సీన్‌ మారుతోందా..? పరిస్థితిలు చూస్తుంటే నిజమేననిపిస్తోంది. నిన్నటి వరకు..

Telangana: తెలంగాణ రాజకీయాల్లో స్పష్టమైన మార్పులు.. అసలేం జరుగుతోంది.?
Telangana Politics

Updated on: Jun 06, 2023 | 11:59 AM

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు వస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్త సమీకరణాలకు పార్టీలు తెర లేపుతున్నాయి. పాత మిత్రులు కొత్తగా పొత్తు పెట్టుకుంటారా..? కర్నాటక ఫలితాల తర్వాత సీన్‌ మారుతోందా..? పరిస్థితిలు చూస్తుంటే నిజమేననిపిస్తోంది. నిన్నటి వరకు రాజకీయాలు ఒకలా ఉంటే ఇప్పుడు మరోలా మారాయి. ఇంతకీ తెలంగాణ పాలిటిక్స్‌లో ఏం జరుగుతోంది..

ఈ ఏడాది చివర్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు. ప్రధాన పార్టీలన్నీ క్రమంగా ఎన్నికల మూడ్‌లోకి వెళ్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎలక్షన్స్‌లో జట్టుకట్టిన పార్టీలు ఇప్పుడు కొత్త మిత్రులను వెతుక్కుంటున్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరనే నానుడిని వచ్చే ఎన్నికలు రుజువు చేసేలా కనిపిస్తున్నాయి. ఇటీవల ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు.. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో ఏకాంతంగా సమావేశమై చర్చలు జరిపారు. రెండు పార్టీల నేతలు ఏం మాట్లాడారో..? ఏ అంశాలు చర్చకు వచ్చాయో.. వివరాలు మాత్రం బయటకు రాలేదు. అటు చంద్రబాబు కానీ.. ఇటు బీజేపీ నేతలు కానీ సమావేశ వివరాలు బయటపెట్టలేదు. పైపెచ్చు పొత్తుల గురించి ఎక్కడా మాట్లాడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు చెప్పడం రాజకీయ ఊహాగానాలకు తెరతీస్తోంది.

నిన్న మొన్నటి వరకు సభలు, సమావేశాల్లో బీజేపీపైనా.. కేంద్ర ప్రభుత్వంపైనా ఒంటికాలిపై లేచిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ వైఖరిలోనూ మార్పు కనిపిస్తోందనే ప్రచారం జరుగుతోంది. నిర్మల్‌ సభలో బీజేపీ ప్రస్తావన లేదు. పైపెచ్చు కాంగ్రెస్‌ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు గులాబీ దళపతి. దీంతో బీఆర్ఎస్ ఆలోచన ఏంటి? మునుగోడు ఉపఎన్నిక తర్వాత కమ్యూనిస్టులతో బీఆర్‌ఎస్‌ బంధం బలపడింది. అదే కొనసాగుతుందా..? లేక పొత్తుపొడుపులో ఇంకేమైనా జరుగుతుందా అనేది కాలమే చెప్పాలి.

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్‌ పార్టీ మాత్రం కర్నాటక ఫలితాల తర్వాత ఉత్సాహంగా కనిపిస్తోంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో చతికిల పడినా.. గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లిపోయినా.. ఈ దఫా మాత్రం తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనని ఘంటాపథంగా చెబుతున్నారు. స్వయంగా రాహుల్‌ గాంధీనే భారీ ప్రకటనలు చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ కనుమరుగవుతుందని.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్నది ఆయన జోస్యం. ఇప్పటికే రాహుల్‌ పాదయాత్ర చేశారు. ఆ మధ్య వరంగల్‌లో బహిరంగ సభ నిర్వహించారు. సరూర్‌నగర్‌లో ప్రియాంకగాంధీ సభ కూడా జరిగింది. రానున్న రోజుల్లో కార్యక్రమాల స్పీడ్‌ పెంచేందుకు చూస్తున్నారు నాయకులు. బీజేపీ, బీఆర్ఎస్‌లపై మాటల దాడి తీవ్రతను పెంచారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..