
హైదరాబాద్, సెప్టెంబర్ 15: తెలంగాణ రైతులకు సరిపడా యూరియాను పది రోజుల్లోనే సరఫరా చేయాలని.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాను కోరారు. తెలంగాణ రైతుల అవసరాలకు సరిపడా యూరియాను వీలైనంత త్వరగా కేటాయించి, పంపిణీ అయ్యేలా చూడాలని కోరారు. ప్రస్తుతం తెలంగాణలో సాగులో ఉన్న ప్రధాన పంటలు.. వరి, మొక్కజొన్న, పత్తికి యూరియా ఎంతో అవసరమని ఈ పది, పదిహేను రోజులు అత్యంత కీలకమైనందున.. తెలంగాణ రైతుల అవసరాలకు తగ్గట్టుగా యూరియా సరఫరా చేయాలని కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శిని కోరారు.
అలాగే అంతకు ముందు నెలల్లో ఏర్పడిన యూరియా లోటును పూడ్చే విధంగా ఈ నెలలో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని కోరారు.. సెప్టెంబర్ నెలలో ఇప్పటివరకు లక్షా 4 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా జరిగింది.. రానున్న 10 రోజుల్లో మరో లక్ష మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాలని కోరగా.. దేశీయ యూరియా ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేని నేపథ్యంలో.. విదేశాల నుంచి దిగుమతయ్యే యూరియాలో తెలంగాణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని రజత్ కుమార్ మిశ్రా తెలిపారు.. 40 వేల మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇచ్చిన ప్రణాళిక ప్రకారం ఈ వారంలో సరఫరా అయ్యే 40 వేల మెట్రిక్ టన్నులకు ఇది అదనం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.