
ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఇద్దరు ఆకతాయిలు చేసిన పని అరెస్ట్ల వరకు వెళ్లింది. ఓ హోంగార్డ్ ఉద్యోగానికి చిక్కులు తెచ్చి పెట్టింది. ఇంతకీ ఏం జరిగిదంటే..? గత ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరోడ్రంలో ఓపెన్ డ్రింకింగ్పై ఫోకస్ పెట్టిన పోలీసులు పెట్రోలింగ్ చేపట్టారు. పోలీస్ పెట్రోలింగ్ వాహానాన్ని గ్రౌండ్లో పార్క్ చేసి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన ఓ ఇద్దరు యువకులు ఆ పెట్రోలింగ్ వాహనాన్ని తమ రీల్స్ పిచ్చికి కేరాఫ్ మలుచుకున్నారు. ఆ వాహనంలోకి ఎక్కిన ఇద్దరు యువకులు.. మరో యువకుడి సాయంతో వీడియో రికార్డ్ చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా మంచి మాస్ వార్నింగ్ ఆడియోను జోడించి ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అక్కడితో అయినా ఆగిపోయారా అంటే అదీ లేదు.. వాళ్ల రీల్ను మరింత మంది చూడాలన్న ఆశలో అసలు పప్పులో కాలేశారు. ఆ రీల్ కాస్తా వైరల్గా మారడం వివాదానికి తెరలేపింది. దీంతో అలర్ట్ అయిన జిల్లా పోలీసులు విచారణ చేపట్టి సదరు యువకులను గుర్తించి అరెస్ట్ చేశారు.
నిందితులు ఇద్దరు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. అందులో ఒకరు మైనర్ కాగా.. మరొక యువకుడు షేక్ ఫయాజ్గా తేల్చారు వన్ టౌన్ పోలీసులు. విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పెట్రోలింగ్ వాహనం డ్రైవర్, పోలీసు సిబ్బందిపై సైతం శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆదిలాబాద్ వన్ టౌన్ సీఐ సునీల్. ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏరోడ్రం వద్ద బహిరంగ మద్యపానాన్ని అరికట్టేందుకు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, పెట్రోలింగ్ వాహనాన్ని వాడుకుని వీడియోలను చిత్రీకరించి ఇద్దరు యువకులు వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినట్లు సీఐ సునీల్ వివరించారు. చట్ట విరుద్ధంగా వ్యవహరించిన ఈ ఇద్దరిపై ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో 714 /2025 u/sec 329(4), 292 BNS కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.