
సరదాగా గడిపేందుకు విహారయాత్రకు వెళ్లిన ఒకే కుటుంబంలో ఊహించని విషాదం నెలకొంది. కాగ్నానదిలో ఈతకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు నీట మునిగిపోగా.. ఒకరు మృతి చెందారు, మరొకరు గల్లంతయ్యారు. ఈ విషాద వార్త తెలిసి పరామర్శకు వచ్చిన మరో బంధువు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. తమ్ముడి మరణాన్ని తట్టుకోలేక అన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం కోకట్ గ్రామ సమీపంలో బుధవారం (జూన్ 03)ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరుకు చెందిన మోయిజ్ (28), అతని బంధువు సంగారెడ్డి జిల్లా బస్తాపూర్ ప్రాంతానికి చెందిన రహమత్ తమ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం కోకట్ సమీపంలోని కాగ్నానది వద్దకు పిక్నిక్కు వెళ్లారు. అక్కడ మోయిజ్, రహమత్లు సరదాగా ఈత కొట్టేందుకు నదిలోకి దిగారు. అయితే నీటి లోతు ఎక్కువగా ఉండడంతో ఇద్దరూ మునిగిపోయారు. ఒకరినొకరు కాపాడుకునే క్రమంలో మోయిజ్ నీటిలోనే ఊపిరాడక మృతి చెందగా, రహమత్ నది ప్రవాహంలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న యాలాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మోయిజ్ మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన రహమత్ కోసం గజ ఈతగాళ్లతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదం సృష్టించిన శోకం అంతటితో ఆగలేదు. మోయిజ్ మృతదేహాన్ని తరలించిన ఆసుపత్రి వద్దకు పరామర్శించేందుకు వచ్చిన సాజిద్ అనే బంధువు, శవాన్ని చూడగానే తట్టుకోలేకపోయాడు. తీవ్ర దిగ్భ్రాంతితో అక్కడికక్కడే గుండెపోటుకు గురై మరణించాడు. మరోవైపు, ఈ ప్రమాదంలో చనిపోయిన తన తమ్ముడిని చూసేందుకు వచ్చిన అన్న సైతం తీవ్ర మనస్తాపంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆయన పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం నిమిత్తం అత్యవసరంగా హైదరాబాద్కు తరలించారు. ఒకే ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించడం, మరొకరు ఆసుపత్రి పాలు కావడంతో ఆయా కుటుంబాల్లో గుండెలవిసేలా రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..