
రాఖీ పౌర్ణమి వచ్చిందంటే చాలామంది ముఖ్యంగా మహిళలు తమ సొంత గ్రామాలకు వెళ్తుంటారు. ఏ బస్టాండ్ చూసినా కూడా చాలా రద్దిగా ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆర్టీసీ అందిస్తున్న టీ-9 టికెట్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని సోమవారం రోజున ఓ ప్రకటనలో వెల్లడించింది. నాలుగు రోజుల పాటు ఈ టికెట్ను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో రాఖీ పౌర్ణమి పండగ నేపథ్యంలో మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటుగా టీ-9 టికెట్ల నిలుపుదల అనేది అమల్లో ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెప్పారు. ఇందుకు సంబంధించి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే సెప్టెంబర్ 2 నుంచి మళ్లీ ఈ టికెట్లను అమలు చేస్తామని.. అప్పటినుంచి యథాతథంగా ఈ టికెట్లు కొనసాగుతాయని ఆర్టీసీ తెలిపింది.
ఇదిలా ఉండగా పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణికులకు టీ-9 పేరుతో రెండు టికెట్లను ఆర్టీసీ సంస్థ జారీ చేస్తోంది. అయితే ఆర్టీసీకి 60 కిలోమీటర్ల పరిధిలో రానుపోను ప్రయాణించేందుకు టీ-9-60ని, 30 కిలోమీటర్లకు టీ-9-30 టికెట్లను అందుబాటులోకి ఇటీవల తీసుకొచ్చింది. టీ-9-60 టికెట్ను 100 రూపాయలకు అలాగే టీ-9-30 టికెట్కు 50 రూపాయలు ప్రయాణికుల నుంచి సంస్థ వసూలు చేస్తోంది. అయితే రాఖీ పండగ సందర్భంగా ఈ టికెట్లు నిలిపివేస్తున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. పండగ రోజున బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని.. ఇలాంటి సమాయాల్లో టీ-9 టికెట్లు మంజూరు చేయడం సిబ్బందికి చాలా కష్టతరమవుతుందని ఆయన తెలిపారు. వాస్తవానికి ఈ టికెట్లు ఇవ్వాలంటే ప్రయాణికుడి జెండర్, వయసు, తదితర వివాలన్నింటిని టిమ్ మిషన్లలో నమోదు చేయాల్సి ఉంటుంది.
దీంతో కండక్టర్కు ఆ టికెట్లు ఇవ్వాలంటే కాస్త సమయం పడుతుంది. ఒకవేళ బస్సుల్లో రద్దీ ఎక్కవగా ఉన్నప్పడు చాలా సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల సిబ్బంది చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకోసమే టీ-9 టికెట్లను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు సజ్జనార్ తెలిపారు. ఆగస్టు 29 నుంచి.. సెప్టెంబర్ 1 వరకు నాలుగు రోజుల పాటు ఈ నిలుపుదల అమల్లో ఉంటుందని చెప్పారు. సెప్టెంబర్ 2 తర్వాత మళ్లీ యథాతథంగా టీ-9 టికెట్లు కొనసాగుతాయని చెప్పారు.
రాఖీ పౌర్ణమికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టి-9 టికెట్లను తాత్కాలికగా నిలిపివేస్తున్నట్లు #TSRTC ప్రకటించింది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు నిలుపుదల అమల్లో ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఈ టికెట్లు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
పల్లె వెలుగు బస్సుల్లో…
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) August 28, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.