Watch Video: వామ్మో.. మసీదుకు వెళ్లొచ్చేలోపే మాయం.. వెరైటీ దొంగ చేతివాటం..!

| Edited By: Balaraju Goud

Oct 26, 2024 | 4:43 PM

ఆ బాలుడు మసీదులోకి వెళ్లే ముందు అక్కడే సెల్లార్‌లో ఉంచి వెళ్లాడు. నమాజ్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చే లోపే ఆ బాలుడికి చేదు అనుభవం ఎదురయింది.

Watch Video: వామ్మో.. మసీదుకు వెళ్లొచ్చేలోపే మాయం.. వెరైటీ దొంగ చేతివాటం..!
Cycle Theft
Follow us on

హైదరాబాద్ మహానగరంలో దొంగతనాలు ఎంతగా పెరిగిపోయాయంటే, లెక్క పెట్టి చెప్పలేని పరిస్థితి ఉంది. చెడ్డీగ్యాంగ్ సహా పలు చోట్ల భారీగా చోరీలు జరుగుతూనే ఉన్నాయి. ఒక బాలుడు తనకు ఎంతో ఇష్టమైన సైకిల్ తీసుకుని మసీదులో ప్రార్థన చేసి తిరిగి వచ్చి చూసేలోపు ఆ సైకిల్ మాయం చేశాడు ఓ ప్రబుద్ధుడు. దీంతో లబోదిబోమంటూ గొల్లుమన్నాడు ఆ బాలుడు..!

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీనగర్ అల్కాపూర్ కాలనీలో ఉండే మొహమ్మద్ మాజీద్ అనే బాలుడు నమాజ్ చేసేందుకు అని మసీదుకు వెళ్లాడు. తనకు ఎంతో ఇష్టమైన సైకిల్ వెంటబెట్టుకుని వచ్చిన ఆ బాలుడు మసీదులోకి వెళ్లే ముందు అక్కడే సెల్లార్‌లో ఉంచి వెళ్లాడు. నమాజ్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చే లోపే ఆ బాలుడికి చేదు అనుభవం ఎదురయింది.

మసీదు నుంచి వచ్చి చూస్తే అక్కడ అంతకు ముందు పార్క్ చేసిన సైకిల్ కనపడలేదు. దీంతో ఆందోళనకు గురైన ఆ బాలుడు సైకిల్ కోసం చుట్టుపక్కల అంతా వెతికాడు. తన సైకిల్ దొంగతనం జరిగిందని గ్రహించిన ఆ బాలుడు బంధువుల సాయంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు స్వీకరించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగ కోసం వేట మొదలుపెట్టారు.

మసీదులోకి వెళ్లే ముందు సైకిల్ ఇక్కడే పెట్టి వెళ్లానని, తిరిగి వచ్చి చూస్తే సైకిల్ కనిపించలేదని, దొంగతనం జరిగినట్లుగా కనపడుతున్న వీడియో కూడా తన దగ్గర ఉందని ఆ బాలుడు చెబుతున్నాడు. కాగా, హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా ఇలాంటి దొంగతనాలు సర్వసాధారణంగా జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయని.. వీటిని ఎలా అరికట్టాలో తెలియడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి భవిష్యత్తులో మరోసారి జరగకుండా పోలీసులు గట్టిగా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..