Doctor Dangerous Journey: ఎవరైనా సరే ఆ గూడెం చేరాలంటే ప్రాణాలు ఫణంగా పెట్టాల్సిందే..!

| Edited By: Balaraju Goud

Jul 18, 2024 | 9:00 AM

ఛత్తీస్‌గడ్ - తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అడవుల్లో గుట్టపై దాదాపు 50 ఏళ్ల క్రితం వెలిసిన ఓ గిరిజన గ్రామం. ప్రస్తుతం మారుమూల పల్లె విషజ్వరాలతో మంచం పట్టింది. ఆ గిరిపుత్రుల ప్రాణాలు కాపాడడం ములుగు జిల్లా వైద్య సిబ్బంది ఎంతటి సాహసానికి ఒడిగట్టారో తెలుసా..? వారి ప్రాణాలు ఫణంగా పెట్టారు.

Doctor Dangerous Journey: ఎవరైనా సరే ఆ గూడెం చేరాలంటే ప్రాణాలు ఫణంగా పెట్టాల్సిందే..!
Dr Appalaiah Team
Follow us on

ఛత్తీస్‌గడ్ – తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అడవుల్లో గుట్టపై దాదాపు 50 ఏళ్ల క్రితం వెలిసిన ఓ గిరిజన గ్రామం. ప్రస్తుతం మారుమూల పల్లె విషజ్వరాలతో మంచం పట్టింది. ఆ గిరిపుత్రుల ప్రాణాలు కాపాడడం ములుగు జిల్లా వైద్య సిబ్బంది ఎంతటి సాహసానికి ఒడిగట్టారో తెలుసా..? వారి ప్రాణాలు ఫణంగా పెట్టారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మూడు వాగులు దాటుకుంటూ వెళ్లి గుట్టలెక్కి ఆ గిరిపుత్రులకు గోలి బిల్లలు అందించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య బృందం చేసిన సాహసాన్ని చూసిన ప్రతి ఒక్కరూ శబ్భాష్ అంటూ ప్రశంసిస్తున్నారు.

ఛత్తీస్‌గడ్ – తెలంగాణ సరిహద్దులోని ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో పెనుగోలు గ్రామం ఉంటుంది. దట్టమైన అడవిలో కనీసం ఎడ్ల బండి కూడా వెళ్లలేని దయనీయ స్థితిలో గుట్టపై ఈ గ్రామం ఉంటుంది. పెనుగోలు గ్రామానికి వెళ్లాలంటే సామాన్యులకు సాహస యాత్రే. ఇక్కడ నివసించే గిరిజనులకు మాత్రం అలవాటై పోయింది. కానీ కొత్త వారు రావాలంటే ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే..!

వాజేడు నుండి పెనుగోలు గ్రామానికి వెళ్లాలంటే మార్గమధ్యలో మూడు వాగులు దాటాలి రెండు గుట్టలు ఎక్కి దిగాలి. పెనుగోలు గ్రామంలో గత కొద్దిరోజుల నుండి గిరిజనులు జ్వరాలు, అనారోగ్య సమస్యలతో అవస్థలు పడుతున్నారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏకంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య నేతృత్వంలో వైద్య బృందం పెనుగోలు గ్రామానికి పయనమయ్యారు..

వీడియో చూడండి… 

డాక్టర్ అప్పయ్యతో పాటు వైద్య సిబ్బంది అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులు దాటుకుంటూ అడవి మార్గంలో నడుచుకుంటూ పెనుగోలు గ్రామానికి వెళ్లారు. కనీసం రోడ్డు మార్గం కూడా లేని ఈ కారడవిలో కేవలం కర్రలు చేత పట్టుకుని సాహస యాత్ర చేశారు. ఒకరికొకరు సపోర్ట్‌గా వాగులు దాటుకుంటూ వెళ్లారు. భుజాన వైద్య పరికరాలు, మందులు పెట్టుకుని దాదాపు 16 కిలోమీటర్ల మేర కాలినడకన పెనుగోలు గ్రామానికి చేరుకున్నారు. డాక్టర్ అప్పయ్య నేతృత్వంలో వైద్య బృందం ఈ గ్రామంలో గిరిజనుల హెల్త్ సమస్యలు తెలుసుకున్నారు. వారి రక్త నమూనాలు సేకరించి అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించారు. జ్వరాలతో అవస్థలు పడుతున్న వారికి మెడిసిన్ అందించారు.

ఇలా ఒక రోజంతా ఈ గిరిజన గ్రామంలోనే గడిపిన వైద్య సిబ్బంది రాత్రి అక్కడే బస చేశారు. తిరిగి మరుసటి రోజు అదే మార్గంలో వాగులు వంకలు దాటుకుంటూ దట్టమైన అటవీ మార్గంలో వాజేడుకు చేరుకున్నారు. వృత్తి ధర్మంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్యతోపాటు వైద్య సిబ్బంది చేసిన సాహస యాత్రను రాష్ట్ర మంత్రి సీతక్క తోపాటు జిల్లా కలెక్టర్ దినకర అభినందించారు. ప్రతి ఒక్కరూ ఇలా నిబద్ధతతో పని చేయాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…