
తెలంగాణలో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కు అలర్ట్. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి విద్యార్థుల కోసం సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. వాట్సాప్లో హాల్ టికెట్లు, ఎగ్జామ్ సెంటర్ తెలిపే క్యూఆర్ కోడ్స్ సహా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.
తెలంగాణలో SSC పరీక్షల సందడి మొదలైంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఈ ఏడాది మొత్తం 5 లక్షల 28 వేల 239 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 5 లక్షల 17 వేల మంది కాగా.. బాలురు, బాలికల సంఖ్య దాదాపు సమానంగా ఉంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యాశాఖ పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 1582 ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటే, 1094 ప్రైవేట్ స్కూళ్లలో ఉన్నాయి. ప్రతి సెంటర్ వద్ద తాగునీరు, ఫర్నిచర్, బాలబాలికలకు విడివిడిగా టాయిలెట్ వసతులు కల్పించారు. పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా సిట్టింగ్ స్క్వాడ్స్ను కూడా రంగంలోకి దించారు. సమస్యాత్మక కేంద్రాలపై విద్యాశాఖ ప్రత్యేక నిఘా ఉంచింది.
ఈసారి పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వం కొన్ని వినూత్న మార్పులు చేసింది. విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాన్ని సులభంగా వెతుక్కునేందుకు హాల్ టికెట్పై QR కోడ్ను ముద్రించారు. దీన్ని స్కాన్ చేస్తే సెంటర్ లొకేషన్ డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్లో కనిపిస్తుంది. అంతేకాదు విద్యార్థులు తమ హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా పొందేలా ఏర్పాట్లు చేశారు. 8096958096 నంబర్కు మెసేజ్ పంపి నిమిషాల్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. గత ఏడాది లాగే ఈసారి కూడా ఆన్సర్ బుక్లెట్కు OMR షీట్ జత చేసి ఉంటుంది. OMR షీట్ విధానంపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించేలా వెబ్సైట్లో నమూనా పత్రాలను అందుబాటులో ఉంచింది విద్యాశాఖ. పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా వెళ్లి పరీక్షలు బాగా రాయాలని టీవీ9 కూడా ఆల్ ది బెస్ట్ చెబుతోంది.