
Siddipet Collector: తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తాత్కాలిక సచివాలయం భవన్లో సీఎస్ సోమేష్ కుమార్కు అందజేశారు. అయితే వెంకట్రామిరెడ్డి త్వరలో టీఆర్ఎస్ చేరనున్నట్లు సమాచారం. ఈ రోజు ఆయన బీఆర్కే భవన్కు చేరుకోవడంతో రాజీనామా చేస్తారనే ఊహాగానాలు వచ్చాయి. అనుకున్నట్లుగానే తన రాజీనామా లేఖను రాష్ట్ర సీఎస్కు అందజేశారు. అకస్మాత్తుగా వెంకట్రామిరెడ్డి రాజీనామా చేయడంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కాగా, వెంకట్రామిరెడ్డి ఇటీవల ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలు ఆసరా చేసుకుని ప్రభుత్వంపై పలు విమర్శలు చేశాయి. అయితే వెంకట్రామిరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వెంకట్రామిరెడ్డిది పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామం.
అయితే రాజీనామా ఆమోదం తర్వాత వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కోసం ఎంతో కృషి చేస్తోందని, అభివృద్ధి వైపు దూసుకెళ్తోందని అన్నారు. అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం కావాలని రాజీనామా నిర్ణయం తీసుకున్నానని అన్నారు. సీఎం కేసీఆర్ నుంచి పిలుపు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని అన్నారు.