
తెలంగాణలో పాఠశాలల రీఓపెన్పై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా నిర్ణయించిన తేదీని మారుస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు జూన్ 12న కాకుండా జూన్ 15వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి వేసవి సెలవుల తర్వాత జూన్ 12న పాఠశాలలను తిరిగి తెరవాలని విద్యాశాఖ భావించింది. అయితే ఆ తర్వాతి రోజుల్లో అంటే జూన్ 13న రెండో శనివారం, జూన్ 14న ఆదివారం వచ్చాయి. కేవలం ఒక్క రోజు అంటే జూన్ 12న స్కూళ్లు తెరిచి, ఆ వెంటనే వరుసగా రెండు రోజులు సెలవులు రావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నుండి ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు అందాయి. ఈ విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించిన ప్రభుత్వం, విద్యార్థుల సౌకర్యార్థం రీఓపెనింగ్ తేదీని జూన్ 15 సోమవారంకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
పాఠశాలల పునఃప్రారంభం ఆలస్యం కావడం వల్ల విద్యార్థులు కోల్పోయే విద్యా సమయాన్ని, నిర్దేశిత పనిదినాలను భర్తీ చేసేందుకు విద్యాశాఖ ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ 2026-27 ప్రకారం పనిదినాల నియమాలను పాటించేందుకు గానూ.. వచ్చే నెల జూలై 11 వచ్చే రెండో శనివారాన్ని సాధారణ పనిదినగా మార్చారు. ఆ రోజున రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు యధావిధిగా నడుస్తాయని స్పష్టం చేశారు.
ఈ నూతన ఆదేశాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్లు, అలాగే అన్ని జిల్లాల డీఈవోలు తమ పరిధిలోని పాఠశాలలకు చేరవేసి, తగిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. ఈ నిర్ణయంతో విద్యార్థులకు వరుస సెలవుల ఊరట లభించినట్లయింది.