Telangana: మందేసి.. గాబరా గాబరాగా దోశ తింటున్నాడు.. కట్ చేస్తే..
దోశ తింటుండగా ఒక్కసారిగా గొంతులో ఇరుక్కోవడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో చోటు చేసుకుంది. ఘటనా తాలూకా పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...
తెలంగాణలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. గొంతులో దోశ ఇరుక్కొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో జరిగింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సుభాష్నగర్లో నివాసముంటున్న వెంకటయ్య (43) అనే వ్యక్తి మద్యం సేవించిన అనంతరం దోశ తింటున్నాడు. ఈ క్రమంలో, దోశ గొంతులో ఇరుక్కుకపోవడంతో శ్వాస అందలేదు. నీళ్లు తాగుతుండగానే పక్కకు ఒరిగిపోయి.. అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతన్ని వెంటనే ఆసుప్రతికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. కళ్లెదుటే ఇంటి పెద్ద దిక్కు ప్రాణాలు వదలడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వెంకటయ్యకు భార్య, ముగ్గురు కూతుర్లు ఉన్నారని తెలిసింది.
ఇటీవల ఇలాంటి ఘటనే కేరళలోనూ వెలుగుచూసింది. వలయార్లో ఇడ్లీలు తినే పోటీలు జరిగాయి. తక్కువ సమయంలో.. ఎక్కువ ఇడ్లీలు తినే ప్రయత్నంలో 50 సంవత్సరాల వయసున్న వ్యక్తి మృతి చెందాడు. పోటీలో భాగంగా ఇడ్లీలు తింటున్న సమయంలో.. గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. తక్కువ సమయంలో ఎక్కువ ఫుడ్ వేగంగా తిన్నప్పుడు లేదా తినే సమయంలో మాట్లాడితే, ఆహారం శ్వాసనాళంలో చిక్కుకుని.. ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వైద్య పరిభాషలో దీనిని ఆస్పిరేట్ అంటారట. ఎప్పుడైనా ఆహారం తింటుడంగా.. ఎక్కిళ్లు వచ్చినా.. గొంతులో ఫుడ్ ఇరుక్కుపోయినట్లు అనిపించినా.. వెంటనే నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే చేతితో వీపు వెనుక భాగంలో తట్టాలంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..