ఇదేందయ్యా ఇదీ.. గూగుల్‌ మ్యాప్‌ని నమ్ముకుంటే ఇలా జరిగింది! గూగుల్‌లో రోడ్డు.. కళ్లముందు నీళ్లు

| Edited By: Ravi Kiran

Sep 08, 2023 | 1:03 PM

ఎవడే సుబ్రమణ్యం సినిమాలో హీరో నాని మొబైల్‌లో గూగుల్ మ్యాప్ చూసుకుంటూ హిమాలయాల్లోని దూద్‌ కాశీకి వెళ్లిన సన్నివేశం గుర్తుండే ఉంటుంది. కానీ నిజ జీవితంలో గూగుల్‌ను నమ్ముకుని ఎక్కడికైనా వెళ్లితే ఏం జరుగుతుందనే దానికి ఈ సంఘటనే ఆధారం. ఓ లారీ డ్రైవర్‌ గూగుల్ రూట్ మ్యాప్‌ ఆధారంగా..

ఇదేందయ్యా ఇదీ.. గూగుల్‌ మ్యాప్‌ని నమ్ముకుంటే ఇలా జరిగింది! గూగుల్‌లో రోడ్డు.. కళ్లముందు నీళ్లు
Lorry In Deep Water
Follow us on

హుస్నాబాద్, సెప్టెంబర్ 7: ఎవడే సుబ్రమణ్యం సినిమాలో హీరో నాని మొబైల్‌లో గూగుల్ మ్యాప్ చూసుకుంటూ హిమాలయాల్లోని దూద్‌ కాశీకి వెళ్లిన సన్నివేశం గుర్తుండే ఉంటుంది. కానీ నిజ జీవితంలో గూగుల్‌ను నమ్ముకుని ఎక్కడికైనా వెళ్లితే ఏం జరుగుతుందనే దానికి ఈ సంఘటనే ఆధారం. ఓ లారీ డ్రైవర్‌ గూగుల్ రూట్ మ్యాప్‌ ఆధారంగా గమ్యానికి వెళ్లాలనుకున్నాడు. కానీ తీరా చూస్తే కథ అడ్డం తిరిగింది. మ్యాప్‌లో రోడ్డుంది గానీ కళ్ల ముందు పెద్ద ప్రమాదం కనిపించింది. అందుకే రీల్‌ లైఫ్‌ వేరు.. రియల్‌ లైఫ్‌ వేరని చెప్పేది. అసలింతకీ ఏం జరిగిందంటే..

మంగళవారం (సెప్టెంబర్ 5) రాత్రి తమిళనాడు నుంచి చేర్యాల మీదుగా హుస్నాబాద్‌కు ఓ లారీ డ్రైవర్‌ లోడ్‌తో బయల్దేరాడు. లారీలో డ్రైవర్ శివ, క్లీనర్ మొండయ్య ఉన్నారు. ఐతే చీకట్లో వాళ్లు వెళ్లే రూటు అర్థంకాక తికమకపడ్డారు. దీంతో ఫోన్‌లో గూగుల్ మ్యాప్ సహాయం తీసుకున్నారు. ఐతే వారికి రూటు చూపించడంలో గూగుల్ వారిని ‘తప్పుదోవ పట్టించి’ ప్రమాదంలో పడేసింది. సిద్దిపేట జిల్లా గౌరవెల్లి రిజర్వాయర్‌ చేరుకోవడానికి గూగుల్‌ మ్యాప్‌ సహాయం తీసుకుంటే అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టు నీళ్లలోకి సరాసరి చేర్చింది. దీంతో లారీ నీళ్లలో కూరుకుపోయింది.

మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. నందారం స్టేజీ దాటిన వెంటనే నేరుగా రోడ్డు ఉందని డ్రైవర్ శివ, క్లీనర్ మొండయ్యలకు గూగుల్ చూపించింది. చీకట్లో వాళ్లు మ్యాప్‌లో చూపిన విధంగానే లారీని నడిపారు. దీంతో లారీ ఓ చోట నీళ్లలోకి వెళ్లింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నీళ్లు రోడ్లపై నిలిచిపోయాయని ఇద్దరూ భావించారు. అయితే వారు ముందుకు వెళ్లేకొద్దీ నీళ్ల లోతు పెరిగిపోతుండటంతో ఎందుకో అనుమానం వచ్చి లారీని నిలిపివేశారు. కొద్ది సేపటికే లారీ క్యాబిన్ వరకు నీళ్లు చేరుకున్నాయి. ఎక్కడో తప్పు జరిగిందని గ్రహించిన వారిద్దరూ మెల్లగా కిందకు దిగి సమీపంలోని స్థానికుల వద్దకు వెళ్లారు. సమీపంలోని రామవరం గ్రామస్థులకు జరిగింది తెలియజేశారు. స్థానికులు లారీకి తాళ్లు కట్టి అతి కష్టం మీద రోడ్డు మీదకి తీసుకొచ్చారు. నందారం స్టేజీ వద్ద రోడ్డు స్టాపర్లను ఏర్పాటు చేసి బైపాస్ రోడ్డు మీదుగా లారీనీ అక్కడి నుంచి మళ్లించడంతో ప్రమాదం తప్పింది. లేదంటే అదే రోడ్డనుకుని మృత్యువుని వెతుక్కుంటూ సరాసరి నదిలోకి వెళ్లిపోయేవారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.