TGSRTC: ఐటీ ఉద్యోగులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఈ రూట్లో ప్రత్యేక ఎలక్ట్రిక్ సర్వీసులు.. మరింత వేగంగా ప్రయాణం..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ బస్సులను విడతల వారీగా వివిధ మార్గాల్లో ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా తాజాగా ఐటీ ఉద్యోగులకు ఉపయోగపడేలా మరో రూట్లో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. నగరంలోని ఐటీ ఉద్యోగులకు ఇది ఉపయోగపడనుందని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.

తెలంగాణ ఐటీ ఉద్యోగులకు శుభవార్త. టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మరో కొత్త ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. టీజీఎస్ఆర్టీసీ వివిధ ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్న విషయం తెలిసిందే. నగరంలో ఇప్పటికే వివిధ ప్రాంతాలకు ఇవి తిరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఐటీ ఉద్యోగులకు ఉపయోగపడేలా మరో ప్రాంతానికి ఎలక్ట్రిక్ బస్సు అందుబాటులోకి తెచ్చింది. ప్రగతినగర్ కమాన్ నుంచి వేవ్ రాక్ వరకు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఈ బస్సు వెళుతుంది. ఐటీ ఉద్యోగులకు ఈ బస్సుతో మరింత ప్రయోజనం చేకూరనుంది. తరచూ వందలాదిమంది ఉద్యోగులు హైదరాబాద్లోని నార్త్ ఈస్ట్ ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్లోని వేవ్ రాక్ వైపు ప్రతీరోజు రాకపోకలు సాగిస్తున్నాయి. వారికి ఈ సర్వీస్ ఉపయోగపడనుంది.
టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీస్
ప్రగతినగర్ కమాన్ నుంచి ఉదయం 7.45 గంటలకు, 8.15 గంటలు, 9.15 గంటలు, 10.15 గంటలకు ఈ బస్సులు బయల్దేరతాయని ఆర్టీసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఇక వేవ్ రాక్ నుంచి సాయంత్రం 4.15 గంటలు, 5.15 గంటలు, 6.45 గంటలకు ఈ బస్సులు ప్రగతి నగర్కు వెళతాయి. ఈ బస్సులు బాచుపల్లి క్రాస్ రోడ్, మల్లంపేట, ఓఆర్ఆర్ ఎగ్జిట్-4ఏ, ఎగ్జిట్-1, సైయంట్ సిగ్నల్, ఐసీఐసీఐ సిగ్నల్ మీదుగా వేవ్ రాక్కు వెళతాయి. ఉదయం ఐటీ ఉద్యోగులు కార్యాలయానికి వెళ్లే సమయంలో.. తిరిగి సాయంత్రం ఆఫీసుల నుంచి తిరిగి వెళ్లే సమయంలో అందుబాటులో ఉండేలా వీటిని నడుపుతున్నారు. ప్రగతినగర్, బాచుపల్లి, మల్లంపేట ప్రాంతాల్లోని ఐటీ ఉద్యోగులతో ఈ సర్వీసులతో ఊరట కలగనుంది. ప్రస్తుతం బస్సులు ఎక్కువగా లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలు, క్యాబ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. అయితే ఓఆర్ఆర్ మీదుగా బస్సు సర్వీస్ అందుబాటులోకి రావడంతో నేరుగా వెళ్లవచ్చు. దీని వల్ల ప్రయాణ సమయం తగ్గుతుంది. మార్గం మధ్యలో వాహనాలను మారాల్సిన పని ఉండదు. అయితే ప్రస్తుతం మూడు ట్రిప్పులను నడుపుతుండగా.. భవిష్యత్తులో మరిన్ని ట్రిప్పులను పెంచే అవకాశముంది. ప్రయాణికుల రద్దీని అనుగుణంగా మరిన్ని బస్సులను రాబోయే రోజుల్లో నడపాలని టీజీఎస్ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.
భవిష్యత్తులో మరిన్ని బస్సులు
అయితే నగరంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చింది. పర్యావరణానికి మేలు చేకూర్చే ఈ వాహనాలను మరిన్ని ప్రవేశపెడుతోంది. డీజిల్ బస్సుల స్థానంలో వీటిని తీసుకొస్తోంది. భవిష్యత్తులో నగరంలో అసలు డీజిల్ బస్సులే లేకుండా చేయనుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం ఈ-డ్రైవ్ పథకంలో భాగంగా మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసేందుకు టెండర్లను కూడా ఆహ్వానించింది.
