
హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలను కలుపుకుని ఉన్న క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి దశ అమలుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్లోని సెక్రటేరియట్లో సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పూర్తి పారదర్శకత ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా అర్హులైన కుటుంబాలనే ఎంపిక చేయాలని అధికారులను కఠినంగా ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో భూముల గుర్తింపులో పేదల జీవనాధారాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కొందరు అద్దెకు ఇవ్వడం, లేకపోతే ఖాళీగా ఉంచడం ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసి. ఏప్రిల్ 30లోపు సమాధానం ఇవ్వాలని గడువు విధించారు. స్పందించకపోతే కేటాయింపులు రద్దు చేసి అర్హులకు మళ్లీ కేటాయిస్తామని హెచ్చరించారు.
2బీహెచ్కే, జవహర్లాల్ నెహ్రు అర్బన్ రెన్యువల్ మిషన్ కింద కేటాయించిన ఇళ్లపై మే 1 నుంచి తనిఖీలు ప్రారంభించాలని ఆదేశించారు. నోటీసులకు స్పందించిన లబ్ధిదారులు బాండ్ పేపర్పై తాము ఆ ఇళ్లలోనే నివసిస్తామని హామీ ఇవ్వాలి. అలా చేయకపోతే ప్రభుత్వం కేటాయింపును రద్దు చేసే అధికారాన్ని వినియోగించనుంది. ఇక ఇళ్లతో పాటు ప్రాథమిక సౌకర్యాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యుత్, తాగునీరు, డ్రైనేజ్ సదుపాయాలను పూర్తిస్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ ప్రక్రియలో GHMC సహకారం తీసుకోవాలని సూచించారు. ప్రత్యేకంగా 22 వేల ఇళ్లకు విద్యుత్ మీటర్లు అత్యవసరంగా అమర్చాలని చెప్పారు.
అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ టవర్లను త్వరితగతిన పూర్తి చేసి. సిద్ధమైన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అందించాలని మంత్రి ఆదేశించారు. ఇళ్ల కాలనీల్లో నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్స్లను అద్దెకు ఇవ్వకుండా వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. అలా వచ్చే ఆదాయాన్ని సంఘం, ప్రభుత్వ సంయుక్త ఖాతాలో జమ చేయాలని స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.